సుజనా చౌదరి కొత్త పార్టీ.. పేరు కూడా మార్చేసుకున్నారు..
తన బ్లడ్ గ్రూప్ తెలుగుదేశమేనని చాలా సార్లు చెప్పుకున్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. రాష్ట్రంలో 'తెలుగు జనతా పార్టీ(టీజేపీ)' పేరుతో కొత్త పార్టీ పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, పేరును కూడా భజన చౌదరిగా మార్చేసుకున్నట్లు అర్థమవుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి ఘాటు సెటైర్లు వేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి విషయంలో సుజనా.. బీజేపీ ఎంపీగా కాకుండా పచ్చి తెలుగుదేశం నేతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అసలు సుజనా ఏమన్నారంటే..
బీజేపీ ఎంపీ సుజనా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కారు చేస్తోన్న మూడు రాజధానుల ప్రతిపాదన అర్థంలేనిదని, అమరావతి అంగుళం కూడా కదలటానికి వీల్లేదని, ఒకవేళ రాజధాని మార్చితే కేంద్ర ప్రభుత్వానికి 90 వేల కోట్ల పరిహారం చెల్లించాల్సిఉంటుందని, ఢిల్లీ పెద్దలతో అన్నీ మాట్లాడిన తర్వాతే తానీ ప్రకటన చేస్తున్నానని చెప్పారు. రాజధానిపై ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్న వేళ సుజనా వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీశాయి.
మాకు అర్థమైంది ఇదే..
రాజధానిపై ఎంపీ సుజనా కామెంట్లను బట్టి ఆయన టీడీపీకి వత్తాసుపలుకుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నదని ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే మాట్లాడుతున్నానని సుజనా చెప్పారు. మరి అమరావతిలో భూముల అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందికదా, ఆ విషయాన్ని కూడా ఆయన అడిగితే బాగుండేది. ఒక్కటైన పనికొచ్చే పని చేస్తే రాష్ట్రానికి మంచి జరిగుండేదికదా?''అని అమర్ నాథ్ ప్రశ్నించారు.
కోవర్డు కంటే ఎక్కువ
బీజేపీలో టీడీపీ కోవర్టుగా పనిచేస్తోన్న సుజనా చౌదరి.. చంద్రబాబుకు అపరిమితంగా భజన చేస్తూ.. పేరును భజన చౌదరిగా మార్చుకున్నట్లు కనిపిస్తోందన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే.. ప్రజల్ని తప్పుదోవపట్టించేలా తప్పుడు మాటలు చెప్పడం సుజనా ఇకనైనా మానుకోవాలని, సీఎం పట్ల అమర్యాదగా మాట్లాడటం మంచిదికాదని సూచించారు. నిజానికి రాజకీయ పార్టీల్లో కోవర్టులెవరో తెలియకుండా ఉంటారని, సుజనా మాత్రం బాహాటంగా టీడీపీ, చంద్రబాబు తరఫున మాట్లాడుతున్నారని అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు.