Vijayawada: టీడీపీకి కౌంటర్: అయిదేళ్లూ ఏం చేశారు?: మూడు రాజధానుల కోసం ఉద్యమించిన వైసీపీ.. !
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతుల సహకారంతో నిరసన ప్రదర్శనలు, ఆందోళలను నిర్వహిస్తూ వస్తోన్న తెలుగుదేశం పార్టీపై ఎదురు దాడికి దిగింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా- విజయవాడలో భారీ ప్రదర్శనను చేపట్టింది. పలువురు శాసనసభ్యులు, వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు.
బీఆర్టీఎస్ రోడ్డు నుంచి
విజయవాడ సత్యనారాయణ పురం సమీపంలోని బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ఈ ఉదయం ఆరంభమైంది ఈ ర్యాలీ. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఈ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. మాజీమంత్రి కొలసు పార్థసారథి, జోగి రమేష్, సామినేని ఉదయభాను సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ర్యాలీగా తరలి వెళ్లారు.
ప్లకార్డులు.. నినాదాలు..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారాన్ని వికేంద్రీకరించాల్సిందేనంటూ పట్టుబట్టారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలు సమంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అధికార వికేంద్రీకరణను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.
రాజకీయ దురద్దేశంతోనే..
మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయ దురుద్దేశంతోనే వ్యతిరేకిస్తోందని పార్థసారథి విమర్శించారు. అమరావతి ప్రాంత రైతులను భ్రమల్లో ముంచెత్తిందని ధ్వజమెత్తారు. వారిని మభ్య పెట్టి.. నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోందని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో తనంత సీనియర్ నాయకుడు లేరని డప్పు కొట్టుకుంటూ తిరిగే చంద్రబాబు.. చివరికి అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
టీడీపీకి భవిష్యత్తు ఉండదు..
మూడు రాజధానులను ఏర్పాటు వల్ల తమ పార్టీకి భవిష్యత్తే ఉండదని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని జోగి రమేష్ విమర్శించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ పార్టీ ఇప్పటికే మనుగడను కోల్పోయే స్థితికి చేరుకుందని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. తాను సంక్షోభంలో చిక్కుకున్న ప్రతీసారీ చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు.
అసెంబ్లీ ముట్టడి ఎవరి కోసం?
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ముట్టడించాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిందని, దీన్ని ఎవరి కోసం ఈ ఆందోళనను చేపట్టారని వారు ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గ ప్రజల ఆర్థిక ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు ఇలాంటి దివాళాకోరు కుట్రలను పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉండి అమరావతిని నిర్మించకపోగా.. ఇప్పుడు మూడు రాజధానులను అడ్డుకోవడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.