రాఫెల్ జెట్లపై బీజేపీ ట్వీట్ను అందుకున్న సాయిరెడ్డి- ఇంకాస్త మసాలా వేసి చంద్రబాబుపై..
ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్లను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొనుగోలు చేసిన వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకుంటోంది. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర లేకపోయినా ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ మాత్రం ప్రత్యర్ధులకు టార్గెట్గా మారింది. దీంతో రాఫెల్ జెట్లపై చంద్రబాబు ట్వీట్ పట్టుకుని ఇప్పటికే బీజేపీ నేతలు ఆడుకుంటుండగా.. ఇప్పుడు వైసీపీ కూడా అదే స్వరం అందుకుంది.
అమరావతికే బీజేపీ జాతీయ నేతల జై- కేంద్రం స్పష్టత ఇచ్చినా-జాతి నేతలే అంటున్న సాయిరెడ్డి
గతంలో మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుడ్ బై చెప్పేసిన టీడీపీ ఆ తర్వాత బీజేపీతో పాటు ఎన్డీయేపైనా ధర్మపోరాటం చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీని కూడా భాగస్వామిగా చేసుకుంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈ వ్యవహారాన్ని బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా లైట్ తీసుకున్నాయి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ధర్మపోరాటం సందర్భంగా ఫ్రాన్స్తో కేంద్రం డీల్ కుదుర్చుకున్న రాఫెల్ జెట్ల వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టలేదు. అప్పట్లో రాఫెల్ జెట్లలో భారీ స్కాం జరిగిందంటూ బహిరంగంగానే ఆరోపించారు. సీన్ కట్ చేస్తే తాజాగా ఆయన రాఫెల్ జెట్లను పొగుడుతూ దేశం గర్వించే యుద్ధవిమానం అంటూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.
చంద్రబాబు ట్వీట్పై స్పందించిన బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి యూటర్న్లు ఇంకెన్నాళ్లు బాబూ అంటూ కౌంటర్ ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని అందుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరింత మసాలా దట్టించి మరో ట్వీట్ చేశారు. ఇందులో తనను తాను పాతాళానికి గిరాటేసుకోవడంలో బాబు గారిని మించిన అనుభవజ్ఞుడు ప్రపంచంలోనే లేరని పేర్కొన్నారు. రఫేల్ విమానాల కొనుగోళ్లలో ప్రధాని 59 వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారని దుమ్మెత్తి పోశాడని, అదే నోటితో రఫేల్ జెట్లతో దేశం భక్తి పెరిగిందని కొనియాడటం ఊసరవెల్లులని సిగ్గుపడేలా చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.