వకీల్ సాబ్ పోస్టర్లు అతికిస్తున్న చంద్రబాబు- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్
ఏపీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంపై వైసీపీ వర్సెస్ జనసేన ప్లస్ టీడీపీ ప్లస్ బీజేపీ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ చిత్రం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరాల్సిన నిర్మాతలు.. హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడంతో ప్రభుత్వం బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై వైసీపీ వర్సెస్ మిగతా పార్టీలుగా రాజకీయ మాటలయుద్ధం సాగుతోంది.
వకీల్ సాబ్ టికెట్ల రేట్ల పెంపు విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన మండిపడుతుండగా.. అధికార పార్టీ నేతలు కూడా అందుకు తగ్గట్టుగానే కౌంటర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. వకీల్ సాబ్కు మద్దతు ఇస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వారికి ఇందులో సాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. ఈ ట్వీట్లో చంద్రబాబు, బీజేపీ నేతలతో పాటు మీడియానూ లాగారు.
వకీల్ సాబ్ చిత్రం టికెట్ల రేట్ల పెంపు విషయంలో మద్దతిస్తున్న చంద్రబాబు, బీజేపీ నేతలతో పాటు వారికి అండగా ఉన్న మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరంతా వకీల్ సాబ్ చిత్రానికి పోస్టర్లు అంటిస్తున్నారంటూ చురకలు అంటించారు. 'సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్లు, కమెడియన్లు పాల్గొని సక్సెస్ కోసం వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతుంటారు. ప్యాకేజి స్టార్ రీమేక్ మూవీ కోసం బాబు, అను'కుల మీడియా, బిజెపి పెద్దలు 'పోస్టర్లు అతికించే' స్థాయికి దిగజారడం రాజకీయాలకు దాపురించిన దరిద్రం కాక మరేంటి?' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లో రెచ్చిపోయారు.
సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్లు, కమెడియన్లు పాల్గొని సక్సెస్ కోసం వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతుంటారు. ప్యాకేజి స్టార్ రీమేక్ మూవీ కోసం బాబు, అను’కుల మీడియా, బిజెపి పెద్దలు ‘పోస్టర్లు అతికించే’ స్థాయికి దిగజారడం రాజకీయాలకు దాపురించిన దరిద్రం కాక మరేంటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 14, 2021