రూ.700 కోట్లు: ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుకు శ్రీకారం, చంద్రబాబు, పవన్పై విజయసాయిరెడ్డి ఫైర్..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఉద్దానం పేరు చెప్పి గతంలో చేసేందేమీ లేదని విమర్శించారు. కానీ సీఎం జగన్ అలా కాదని స్పష్టంచేశారు. సమస్య పరిష్కారం కోసం పాటుపడతారని పేర్కొన్నారు. ఉద్దానం ఏడు మండలాల కోసం రూ.700 కోట్లతో రక్షిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఆంధ్రా ఊటీ లూటీ, రాయలసీమ రౌడీలు వస్తారని విషం, విశాఖ పార్ట్-2లో విజయసాయిరెడ్డి
పర్యటనలతో హడావిడి...
గత ప్రభుత్వం ఏం చేసిందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కిడ్నీ బాధితులు ఉన్న ప్రాంతాల్లో పర్యటించి తెగ హడావిడి చేశారు. మరీ చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కానీ వారి సమస్యకు పరిష్కారం చూపిస్తోన్నది సీఎం జగన్ ఒక్కరేనని స్పష్టంచేశారు. ఉద్దానం కిడ్ని సమస్యను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాటలకే పరిమితం చేశారు. పర్యటించి బాధితులను ఆదుకుంటామంటూ మొసలి కన్నీరు కార్చారు. అధికారంలో ఉన్న సమయంలో మాత్రం పట్టించుకోలేదు. ఉద్దానం కిడ్ని సమస్యకు శాశ్వత పరిష్కారంగా తాగునీటి పథకాన్ని మందుగా తీసుకువచ్చింది. సమగ్ర తాగునీటి పథకం కోసం రూ.700 కోట్లు కేటాయించింది.
విషపూరిత కారకాలతోనే కిడ్నీ సమస్య
శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో గల రెండు పురపాలక సంఘాలు కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోనే కిడ్నీ బాధితుల సమస్య ఉంది. మంచినీటిలో గల విషపూరిత కారకాలు ఇక్కడి ప్రజల కిడ్నీ సమస్యకు కారణమని పరిశోధనలో తేలింది. ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీటిని అందించటమే సమస్యకు పరిష్కారం అని మాజీ సీఎం వైఎస్ఆర్ అప్పట్లో ప్రకటించారు. అందుకోసం శ్రీకారం చుట్టగా.. ఆయన మృతితో పథకం అటకెక్కింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయలేదు. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెగ హడావుడి చేసి వదిలేశారు.
Recommended Video
100 కి.మీ నుంచి నీరు తరలించి.. శుద్ది చేసి అందజేత
ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74 లక్షల మంది ఉన్నారు. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం బోరు నీటిపై ఆధారపడుతున్నారు. భూ గర్భ జలాలలో కిడ్నీ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్న కారకాలు ఉన్నాయని నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటిని తాగడం తప్పడం లేదు. వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేస్తారు. ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్ హెడ్ ట్యాంకులకు మేఘ కంపెనీ తరలిస్తోంది. తర్వాత ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. దీంతో ఉద్దానం ప్రాంత ప్రజల చిరకాల సమస్య తీరనుంది.