విజయవాడలో విజయసాయి రెడ్డి సెటిల్: గృహప్రవేశం..!
విజయవాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఇక విజయవాడలో స్థిర పడ్డారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన ఇంట్లో ఆయన శుక్రవారం ఉదయం గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా ఆయన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంట్లో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతి కొద్దిమంది ముఖ్యులకు మాత్రమే ఆహ్వానం అందింది. కొంతమంది పార్టీ నాయకులు ఈ గృహ ప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు.
చంద్రబాబు కష్టం పగోడికీ రాకూడదు: 'ప్యాకేజీ స్టార్’ అంటూ పవన్పై విజయసాయి తీవ్ర విమర్శలు
అధికారంలోకి వచ్చిన తరువాతా హైదరాబాద్ లోనే..
రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత విజయసాయి రెడ్డి హైదరాబాద్ లోనే కొనసాగుతున్నారు. ఆయన నివాసం అక్కడే ఉంది. అయినప్పటికీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరిని, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, నారా లోకేష్ ను తనదైన శైలిలో చురకలు వేస్తూ వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఆయన సమకాలీన రాజకీయ అంశాలపై తనదైన శైలిలో సెటైర్లను జోడించి ట్వీట్లు చేస్తూ వచ్చారు.
సమాయాభావాన్ని తగ్గించుకోవడానికే..
పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తన పాత్రను, పరిధిని విస్తృతం చేసుకున్నారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఇక పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి వచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించడం కష్టం కావడం, రాకపోకలకే అధిక సమయం తీసుకుంటూ ఉండటం వల్ల ఆయన విజయవాడలో స్థిర పడాలని నిర్ణయించుకున్నారు. ఏడాది కిందట ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. కార్తీక మాసం మంచి రోజు కావడం వల్ల శుక్రవారం నాడు నూతన ఇంట్లోకి అడుగు పెట్టారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా..
కొత్తగా నిర్మించిన ఇంట్లో అత్యాధునిక వసతులు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి వీలుగా విశాలమైన హాలు, డిజిటల్ స్క్రీనింగ్, ఎల్ఈడీ టీవీలు వంటిని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటానికి వీలుగా వీడియో కాన్ఫరెన్స్ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తీరిక లేకుండా గడుపుతున్నారు. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభం కానున్నందున త్వరలోనే ఆయన కొత్త నివాసంలో పార్లమెంటరీ సభ్యులతో సమావేశం అవుతారని చెబుతున్నారు.