టీవీ9 రవిప్రకాష్ అవినీతి చిట్టా ఇదే: సుప్రీంకోర్టు సీజేకు విజయసాయి రెడ్డి లేఖ
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. రవిప్రకాష్ స్కాంలపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ లేఖ రాశారు.
ఫెమా, ఆర్బీఐ రెగ్యూలేషన్స్, మనీలాండరింగ్ తోపాటు ఇన్కమ్ టాక్స్ ఎగ్గొట్టడం ద్వారా భారీగా అక్రమాస్తులు కూడగట్టారంటూ తన లేఖలో ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులను మోసం చేసిన మొయిన్ ఖురేషీతోనూ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్తో కలిసి చాలా మందిని మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు.
సానా సతీష్, మొయిన్ ఖురేషీ, రవిప్రకాష్ ముగ్గురూ కలిసి నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని తన లేఖలో పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. ఆ హవాలా సొమ్మును కెన్యా, ఉగాండాలో రవిప్రకాష్ కంపాల సిటీ కేబుల్లో పెట్టుబడులు పెట్టారని విజయసాయి రెడ్డి తన లేఖలో వివరించారు.
రవిప్రకాష్ అవినీతి వ్యాపారాలకు సంబంధించిన జాబితా, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ద్వారా అందించారు విజయసాయి రెడ్డి. అక్టోబర్ 3న సీజేకు లేఖ రాయడంతో, ఇప్పటికే ఈడీ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కాగా, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను అక్టోబర్ 5న బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏబీసీఎల్ కంపెనీ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగంపై రిమాండ్కు తరలించారు. ఈ మేరకు డీసీపీ సుమతి మీడియాకు వివరాలు వెల్లడించారు. అంతకుముందు రవిప్రకాశ్కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రవిప్రకాశ్తోపాటు మూర్తి కూడా నిధులు గోల్ మాల్ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
రవి ప్రకాశ్ను అదుపులోకి తీసుకునే వ్యవహారం నాటకీయ ఫక్కీలో జరిగిపోయింది. ఆయనను అదుపులోకి తీసుకొన్న బంజారా హిల్స్ పోలీసులు ఐదున్నర గంటల సేపు విచారించారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు సంబంధించిన సీతాఫల్ మండిలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. ఆయనపై చీటింగ్ కేసును నమోదు చేశారు. ఆయనతోపాటు ఎంకేవీఎన్ మూర్తిని కూడా చంచల్గూడ జైలుకు తరలించారు.