వైసీపీకి పంచాయతీ ఎన్నికల భయం- అందుకే కరోనా సాకులు- టీడీపీ నేత యనమల
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విపక్ష నేత చంద్రబాబు సూచనలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని వైసీపీ ఆరోపిస్తుండగా.. ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార పార్టీ ఎదురుదాడి చేస్తోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది.
ఏపీలో ఇసుక దోపిడీపై టీడీపీ పోరు- విశాఖలో విపక్ష నేతల హౌస్ అరెస్ట్లు
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం వైఖరిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రంగా తప్పుబట్టారు. ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు వైసీపీ వెనుకంజ వేస్తోందని యనమల ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైసీపీకే ఎందుకు కనిపిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి కట్టెదో దారి అన్నట్లుగా ఉందన్నారు. దేశమంతా ఒక దారి అయితే జగన్ రెడ్డిది మాత్రం ఇంకో దారని యనమల అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ బాధిత వర్గాలన్నీ కలిసి వ్యతిరేక ఓటు వేస్తాయన్నదే వైసీపీ భయమని యనమల తెలిపారు. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో వ్యతిరేకత చూసే వైసీపీ వెనక్కి వెళ్తోందన్నారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసీపీ భయమన్నారు. పింఛన్లు ఇచ్చేది లేదని పేదలను వైసీపీ వాలంటీర్లు బెదిరిస్తారా అని యనమల ప్రశ్నించారు. రేషన్, పింఛన్ జగన్ జేబుల్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా అని ఆయన అడిగారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మళ్లీ బెదిరించలేమనే వైసీపీ ఎన్నికలపై వెనుకంజ వేస్తోందన్నారు.
Recommended Video
దమ్ముంటే ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు వైసీపీ సిద్ధం కావాలని యనమల డిమాండ్ చేశారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు రద్దు చేయాలన్నారు. మళ్లీ తాజాగా అన్ని స్ధానాలకు ఎన్నికలు జరపాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా సీఎస్ జోక్యం అనుచితమని యనమల తెలిపారు. కొత్త జిల్లాల వంకతో ఎన్నికలు వాయిదా వేయాలని చూడటం పలాయన వాదమని యనమన అభివర్ణించారు. 73,74 అధికరణలను గౌరవించాలని, ఎస్ఈసీ కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్దేనన్నారు. కాబట్టి గవర్నర్ కూడా ఎన్నికలకు సహకరించాలన్నారు.