KXIP Vs DC Match 2 మ్యాచ్ చుట్టూ వివాదాలు: పంజాబ్ ఓటమి దాని ఫలితమే: సెహ్వాగ్ ఆన్ ఫైర్
అబుధాబి: క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజా అందించిన మ్యాచ్పై వివాదాలు ముసురుకుంటున్నాయి. ఐపీఎల్-2020 సీజన్లో రెండో మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్.. వివాదాలకు కేంద్రబిందువైంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య సాగిన ఈ మ్యాచ్ స్లాగ్ ఓవర్లలో డీసీ బ్యాట్స్మెన్ మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం, పంజాబ్ జట్టులో మయాంక్ అగర్వాాల్ మెరుపులు మెరిపించిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగింది.
వివాదాలకు దారి తీసిన మ్యాచ్..
సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ మ్యాచ్లో ఢిల్లీ గ్రాండ్ విక్టరీని సాధించినప్పటికీ.. అది కాస్తా వివాదాలకు దారి తీస్తోంది. ఈ విమర్శలు చేసింది కూడా వేరెవరో కాదు.. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. పంజాబ్ ఓడిపోవడానికి అసలు కారణాన్ని వెల్లడించారు. ఢిల్లీ సాధించిన విజయాన్ని తాను తప్పు పట్టట్లేదని, పంజాబ్ గెలిచి తీరాల్సిన మ్యాచ్ అనీ చెప్పారు.పంజాబ్ ఓటమికి అంపైర్ల నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పారు. అంపైరింగ్ లోపాలు ఢిల్లీని గెలిపించాయని మండిపడ్డారు. దానికి గల కారణాన్నీ ఆయన వివరించారు.
19వ ఓవర్లో షార్ట్రన్..
పంజాబ్ ఇన్నింగ్ 19వ ఓవర్లో చోటు చేసుకున్న ఓ ఘటనను వీరేంద్ర సెహ్వాగ్ దీనికి కారణంగా వివరించారు. మయాంక్ అగర్వాల్, క్రిస్ జోర్డాన్ రెండు పరుగుల కోసం ప్రయత్నించారు. జోర్డాన్ క్రీజ్లో తన బ్యాట్ను సరిగ్గా ఉంచలేదనే కారణంతో స్క్వేర్లెగ్లో ఉన్న అంపైర్ దాన్ని షార్ట్ రన్గా పరిగణించారు. పంజాబ్ బ్యాట్స్మెన్ జోర్డాన్ తన బ్యాట్ను క్రీజ్లో ఉంచినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ అంపైర్ దాన్ని షార్ట్రన్గా పరిగణించడం పట్ల పంజాబ్ తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు.
అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
తన దృష్టిలో ఢిల్లీ కేపిటల్స్ను గెలిపించింది మార్కస్ స్టోయినిస్ కాదని.. అంపైర్లని చెప్పారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ను అంపైర్లకు ఇచ్చి ఉంటే బాగుండేదని సెటైర్లు వేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. నిబంధనలకు అనుగుణంగా క్రిస్ జోర్డాన్.. తన బ్యాట్ను క్రీజులోనే ఉంచారని, అది షార్ట్రన్ కాదని చెప్పారు. అంపైర్ తీసుకున్న ఆ నిర్ణయమే పంజాబ్ కొంప ముంచిందని అన్నారు. అందుకే- ఢిల్లీని గెలిపించిన అంపైర్లే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్వీకరించడానికి అర్హులని అన్నారు.