వైజాగ్లో దారుణం... రోడ్డుపై వెళుతున్న మహిళపై యాసిడ్ దాడి...
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న వివాహితపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. దీంతో భాదిత మహిళను స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సంఘటన విశాఖలోని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సాయంత్రం గాజువాకలోని రోడ్డుపై ఇద్దరు అక్కా చెల్లెల్లు నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి టూ వీలర్ పై వచ్చి యాసిడ్ పోసి పరారయ్యాడు. దీంతో వివాహిత మహిళకు శరీరంలో పలు బాగాల్లో గాయాలయినట్టు తెలుస్తోంది.. నడుంతోపాటు చాతీ భాగంలో యాసిడ్ పడడంతో తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.
యాసిడ్ దాడి జరగడంతో అప్రమత్తమైన స్థానికులు ఆమెను గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా యాసిద్ దాడికి గురైన మహిళ హైదరాబాద్కు చెందిన శిరిషగా గుర్తించారు. అయితే గాజువాకలో ఉంటున్న తన చెల్లెలి ఇంటికి శిరిష వచ్చిందని ఆమె సోదరి వివరించారు.