కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు.. 30 కోట్లకు పైగా అక్రమార్జన.. రవాణాశాఖ ఉద్యోగి లీలలు
కొడితే కొండను కొట్టాలనుకున్నాడేమో గానీ గట్టిగానే బాదాడు. 28 ఏళ్ల సర్వీసులో 30 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడు. ఏడాదికో కోటి టార్గెట్ పెట్టుకున్నాడో ఏమో గానీ 28 ఏళ్ల సర్వీస్ వచ్చేసరికి బాగానే కూడబెట్టాడు. కానిస్టేబుల్ గా చేరిన సదరు వ్యక్తి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాడు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది.
విజయనగరం జిల్లాలో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కొత్తపల్లి రవికుమార్ నివాసాలపై ఏసీబీ అధికారులు దాడిచేశారు. విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ సహా దాదాపు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి. దాదాపు 30 కోట్లకు పైగా స్ధిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు బంగారు ఆభరణాలు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
కానిస్టేబుల్ గా చేరి.. కోటీశ్వరుడిగా మారి
విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కొత్తపల్లి రవికుమార్ పై ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ కి ఫిర్యాదులొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రవికుమార్ కు చెందిన ఆస్తులకు సంబంధించి ఇరు రాష్ట్రాల్లో దాదాపు 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల విలువ చూసి ఏసీబీ అధికారులు విస్తుపోవాల్సిన పరిస్థితి. రవాణాశాఖలో కానిస్టేబుల్ గా చేరిన రవికుమార్ అంచెలంచెలుగా ఎఎంవీఐ స్థాయికి చేరాడు. 28 ఏళ్ల సర్వీస్ ఉన్న రవికుమార్ 30 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టడం గమనార్హం.
అందినకాడికి దోచాడు.. ఆస్తులు కూడబెట్టాడు
ఏసీబీ దాడుల్లో రవికుమార్ అడ్డంగా దొరికిపోయాడు. తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తిన రవికుమార్ అక్రమార్జన చివరకు పోలీసులకు చిక్కింది. ఆయన కూడబెట్టిన స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు 120 గ్రాముల బంగారం, ఓ బ్యాంకు లాకర్ లో 399 గ్రాముల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి, బ్యాంక్ బ్యాలెన్స్ 55వేల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు. బహిరంగ మార్కెట్లో మాత్రం 30 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని వెల్లడించారు.
ఇదీ ప్రస్థానం.. అక్రమార్జనకు సోపానం
విశాఖపట్నం నివాసియైన కొత్తపల్లి రవికుమార్ 1990వ సంవత్సరంలో రవాణాశాఖలో కానిస్టేబులుగా ఉద్యోగం పొందారు. గాజువాక, మర్రిపాలెం కార్యాలయాల్లో ఇరవై ఏళ్లకు పైగా పనిచేశారు. 2014లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది విజయనగరానికి బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. విజయనగరం రవాణా శాఖలో కీలకపాత్ర పోషిస్తూ అందినకాడికి దండుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.