జగన్ అరెస్టుతో సంబురాలే.. ఇప్పుడేంటిలా? హోం మంత్రి రుసరుస.. బాబాయి కోసం రామ్మోహన్ ఫైర్..
మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. ఈఎస్ఐ కుంభకోణం కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు.. ఆయనను శుక్రవారం ఉదయం నిమ్మాడలోని స్వగృహంలో అదుపులోకి తీసుకున్నారు. గంటల హైడ్రామా తర్వాతగానీ అచ్చెన్న అరెస్టును అధికారులు ధృవీకరించలేదు. జాతీయ స్థాయిలోనూ దుమారం రేపుతోన్న ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్న అన్నకొడుకు, ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఘాటుగా స్పందించారు.
బాలకృష్ణ మెంటల్ కండిషన్పై మళ్లీ రచ్చ.. చంద్రబాబైనా చెప్పలేదన్న సైరా.. తొంగిచూడొద్దంటూ అనిత ఫైర్..
ఈఎస్ఐతో రాష్ట్రానికేంటి?
అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో ప్రధానంగా వినిపిస్తోన్న ప్రశ్న.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్(ఈఎస్ఐ) ఎవరి పరిధిలో ఉంటుందనేది. చాలా వరకు కేంద్రం నియంత్రణలో ఉండే ఈఎస్ఐ వ్యవహారాల్లో జగన్ సర్కారు కావాలనే కలుగజేసుకుని.. కక్షపూరితంగానే తమ నేతల్ని టార్గెట్ చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. అయితే, ఈ వాదనను హోం మంత్రి సుచరిత ఖండించారు. ఈఎస్ఐ పరిధి ఏమిటన్నదానికంటే.. దోచుకున్నది ప్రజాధనాన్నే కాబట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.
నారా లోకేశ్పై రూ.700 కోట్ల వల.. జగన్కు ఆల్ ది బెస్ట్ చెప్పిన చినబాబు.. అనూష విషయంలో ఫైర్..
ఆ సీన్లు చూశారుగా..
అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనాయకుడైన అచ్చెన్నాయుడిని అదేదో టెర్రరిస్టును బంధించిన తీరుగా లాక్కెళ్లారంటూ టీడీపీ నేతలు చేస్తోన్న కామెంట్లపై హోం మంత్రి ఫైరయ్యారు. ఏసీబీ ముందస్తుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే అచ్చెన్నను అదుపులోకి తీసుకుందని, ఆయన అరెస్టు సీన్లను ప్రజలంతా టీవీల్లో చూశారని, ఎక్కడగానీ అధికారులు దురుసుగా ప్రవర్తించలేదని ఆమె వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే తప్పులకు ఎదో ఒకరోజు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రంలోగా నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని మంత్రి చెప్పారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడంతో అచ్చెన్నకు త్వరితగతిన బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
జగన్ అరెస్టు సమయంలో..
ఈఎస్ఐలో మందులు కొనకుండా బిల్లులు తయారుచేశారు, వైద్య పరికరాలను ఐదింతల ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు, టెండర్లు పిలవకుండా కావాల్సినవాళ్లకు పనులు కట్టబెట్టారు, రూ.900 కోట్ల అక్రమాలు జరిగినట్లు పక్కా ఆధారాలున్నాయి కాబట్టే చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని సుచరిత అన్నారు. అచ్చెన్న అరెస్టు రాజకీయ ప్రేరితం కాదంటూనే హోం మంత్రి గత విషయాలను గుర్తుచేశారు. ‘‘నాడు జగన్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, అరెస్టు చేసినప్పుడు టీడీపీ నేతలు సంబురాలు చేసుకున్నారే? మరి అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నను అరెస్టు చేస్తే ఇంతలా ఎందుకు గింజుకుంటున్నారు? చట్టం ఎవరికైనా సమానమే కదా? ఈరోజుకు కూడా జగన్ ను దొంగ, దోషి అని, శుక్రవారాలు కోర్టుకు వెళతాడని రకరకాలుగా హేళన చేస్తారే.. టీడీపీ హయాంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే మేం చూస్తూ కోర్చోవాలా?'' అని మంత్రి రుసరుసలాడారు.
నిలువెత్తు ప్రజల ధైర్యం..
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో సోదరుడి కొడుకైన ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. వందలమంది గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి అచ్చెన్నను తీసుకెళ్లారనే వార్తలు.. అచ్చెన్న కిడ్నాపయ్యారంటూ చంద్రబాబు ప్రకటించడంతో ఆందోళనకు గురైన రామ్మోహన్.. అచ్చెన్నను అరెస్టు చేసింది ఏసీబీనా? లేక వైసీపీ గుండాలా? అని సందేహం వ్యక్తం చేశారు. ‘‘అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీసే నిలువెత్తు ప్రజల ధైర్యం మా బాబాయ్. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే మా బాబాయ్ చేసిన తప్పా?''అని ప్రశ్నించారు.
వైసీపీకి సత్తా లేదా?
ఏళ్లుగా అణిచివేతకు గురైన బీసీ వర్గాలకు గొంతుకగా నిలిచిన అచ్చెన్నాయుడు.. అసెంబ్లీలో అధికార పార్టీని అన్ని రకాలుగా నిలదీస్తున్నందుకే ఈ తరహా పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎంపీ రామ్మోహన్ అన్నారు. ‘‘అసెంబ్లీలో మా బాబాయిని ఎదుర్కొనే సత్తా మీ 151 ఎమ్మెల్యేలకు లేదా? టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేసేటప్పుడు కనీస చట్టబద్ధంగా వ్యహరించడమైనా చేతకాదా? బీసీ నేతలకిచ్చే గౌరవం ఇదేనా?''అంటూ జగన్ సర్కారుపై ఎంపీ నిప్పులు చెరిగారు.