విశాఖ నుంచి సీబీఐ కోర్టు తరలింపు
విశాఖపట్నం: ఇన్నాళ్లుగా విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించిన మూడవ అదనపు సీబీఐ న్యాయస్థానాన్ని తరలించనుంది ప్రభుత్వం. విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలి పోనుంది. తరలింపు చర్యలను వచ్చేవారం చేపట్టబోతోంది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి గొంటు మనోహర రెడ్డి నోటిఫికేషన్ ను జారీ చేశారు. హైకోర్టు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరి కొద్దిరోజుల్లో విశాఖపట్నం నుంచి మూడో అదనపు సీబీఐ న్యాయస్థానాన్ని సామాగ్రితో సహా తరలించనున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా మూడో అదనపు సీబీఐ న్యాయస్థానం కొన్నాళ్లుగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర తాత్కాలిక హైకోర్టు విజయవాడలో ఉండటం వల్ల పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదనపు సీబీఐ న్యాయస్థానాన్ని రాజధాని ప్రాంతానికి తరలించాలంటూ ఇదివరకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. కిందటి నెల 4వ తేదీన హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖపట్నంలో ఉన్న అదనపు సీబీఐ న్యాయస్థానాన్ని సామాగ్రితో సహా తరలించాలని కోరారు. దీనిపై తాజాగా ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తీసుకుంది.
ఉత్తరాంధ్ర న్యాయవాదులకు ఈ తరలింపు మింగుడు పడట్లేదు. ఏపీ హైకోర్టును శాశ్వతంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాంటూ ఉద్యమిస్తోన్న సమయంలో సీబీఐ న్యాయస్థానం తరలింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. స్వయంగా హైకోర్టు ఆదేశాలతోనే ఈ న్యాయస్థానాన్ని తరలించాల్సి వస్తున్నందున పెద్దగా వ్యతిరేకత రావట్లేదు. ఉన్న సీబీఐ న్యాయస్థానం కూడా తరలి వెళ్లిన నేపథ్యంలో.. శాశ్వత హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తోన్న ఉత్తరాంధ్ర న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల గళానికి మరింత బలం కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అదనపు సీబీఐ న్యాయస్థానాన్ని విజయవాడలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. విజయవాడకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆ నగరంలో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన భవనం కోసం ప్రభుత్వ అధికారులు అన్వేషిస్తున్నారు.