విశాఖ ఉక్కు పోరాటం- టీడీపీ ట్రాప్లోకి జారుకుంటున్న వైసీపీ- 2018 సీన్ రిపీట్ ?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సాగర నగరంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. రాజధాని రాకకు ముందు వైసీపీకి బద్ధ వ్యతిరేకులుగా ఉన్న ఇక్కడి ఓటర్లు రాష్ట్రమంతా ఓటమిపాలైన టీడీపీని ఇక్కడ మాత్రం ఆదరించారు. అయితే రాజదాని ప్రకటన తర్వాత పరిస్ధితులు తమకు అనుకూలంగా మారాయని వైసీపీ భావిస్తున్న తరుణంలో మొదలైన స్టీల్ ప్లాంట్ ఉద్యమం అధికార పార్టీ పుట్టిముంచేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని వైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో టీడీపీని దాటుకుని ఉద్యమంలో ఛాంపియన్గా నిలిచేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు 2019 అనుభవాలని రిపీట్ చేసేలా కనిపిస్తున్నాయి.
ఉక్కు పోరాటంతో విశాఖలో రాజకీయ వేడి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సాగర నగరంలో రాజకీయ నేతలకు చేతి నిండా పని కల్పించింది. నిన్న మొన్నటి వరకూ కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన నేతలంతా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పుణ్యమాని రాజకీయాలు మెదలుపెట్టేశారు. అంతే కాదు ఎన్నికల వేళ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మైలేజ్ కోసం వాడుకోవడంలో ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఛాంపియన్గా నిలిస్తే తప్ప ఎన్నికల్లో ఇక్కడి ప్రజల ఓట్లు కొల్లగొట్టడం సాధ్యం కాదనే అంచనాకు వచ్చేసిన పార్టీలు పోటీలు పడి పాదయాత్రలు, ఉద్యమ కార్యాచరణలు ప్రకటిస్తున్నాయి.
స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో వైసీపీ పులిస్వారీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో దూకుడుగా వెళ్తున్న టీడీపీని అడ్డుకునేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే స్ధానికంగా ఉన్న ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జ్లను మోహరించి కార్మిక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నా వైసీపీకి పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అధికార పార్టీగా ఉన్న పరిమితులతో పాటు ఇతరత్రా సమస్యలే ఇందుకు కారణం. దీంతో ఇక టీడీపీ బాటలోనే పాదయాత్రలకు సైతం వైసీపీ సిద్ధమైపోతోంది. అధికార పార్టీగా ఉంటూ పాదయాత్రలు, ఉద్యమాలు చేయడం చూస్తుంటే వైసీపీపై ఎంత ఒత్తిడి ఉందో అర్ధమవుతుంది. అయితే అంతిమంగా ప్రైవేటీకరణను ఆపలేకపోతే ఇది వైసీపీ పుట్టిముంచడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీ ట్రాప్లో పడుతున్న వైసీపీ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలి రాజీనామా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్దే. అలాగే ఉద్యమంలో తొలి నిరాహారదీక్ష కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్దే. ఇదే కోవలో భారీ పాదయాత్రతో పాటు మూకుమ్మడి రాజీనామాల సమర్పణకు టీడీపీ సిద్దమవుతోంది. దీంతో ఇప్పుడు రాజీనామాలు చేసే పరిస్ధితుల్లో కానీ, నిరాహారదీక్షలు చేసే పరిస్దితుల్లో కానీ వైసీపీ కనిపించడం లేదు. ఇక అంతిమంగా మిలిగింది పాదయాత్ర మాత్రమే. అందుకే వైసీపీ నేతలు భారీ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ బలహీనతల్ని గమనించిన టీడీపీ ఇప్పుడు రాజీనామాలపై ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే పాదయాత్ర, ఇతర నిరసనల విషయంలో టీడీపీ ట్రాప్లో పడిన వైసీపీ ఇప్పుడు రాజీనామాలపై ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
2018 సీన్ రిపీట్ అవుతుందా ?
2018లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై వైసీపీ సమర శంఖారావం పూరించింది. అయితే పేరుకి కేంద్రంపై పోరాటం అయినా చేసిందంతా అప్పటి అధికార టీడీపీపై పోరాటమే. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో యువభేరిల ఏర్పాటుతో పాటు ఇతర కార్యక్రమాల ద్వారా టీడీపీపై ఒత్తిడి పెంచుకుంటూ పోయింది. చివరికి కేంద్రంలో ఉంటూ ప్రత్యేక హోదా సాధించని టీడీపీని నిలదీయాలంటూ వైసీపీ ఇచ్చిన పిలుపుతో పచ్చ పార్టీ బెంబేలెత్తిపోయింది. వైసీపీ ట్రాప్లో పడిన టీడీపీ కేంద్రంలో మంత్రి పదవుల నుంచి తమ ఎంపీల్ని రాజీనామాలు చేయించింది. అప్పటికీ వైసీపీ వెనక్కి తగ్గకపోవడంతో ఏకంగా ఎన్డీయే నుంచే తప్పుకుని తమను తాము నిరూపించుకునేందుకు ఎన్డీయేపై ధర్మపోరాటానికి తెరతీసింది. చివరికి రాజకీయంగా, ఎన్నికల పరంగా దారుణంగా నష్టపోయింది. ఇప్పుడు విశాఖ స్టీల్ పోరాటంలో టీడీపీ ట్రాప్లో వైసీపీ పడటాన్ని బట్టి చూస్తుంటే జగన్ పార్టీకి అదే పరిస్ధితి ఎదురవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.