విశాఖలో పిల్లుల కోసం కూడా రెక్కీ : గొర్రెమాంసం పేరుతో హోటళ్లకు విక్రయం
విశాఖపట్నం: తమ ప్రత్యర్థులను హత్య చేయడానికి రెక్కీలను నిర్వహిస్తుంటారు కొందరు వ్యక్తులు. దీనికి భిన్నంగా పిల్లుల కోసం రెక్కీ నిర్వహించిన ఉదంతం విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది. భక్తుల ముసుగులో భిక్షాటనకు రావడం, పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడం, వాటిని సంచిలో వేసుకుని మాయం కావడం.. కొద్దిరోజులుగా విశాఖపట్నంలో చోటు చేసుకుంటున్న ఈ వరుస సంఘటనలకు పోలీసులు బ్రేక్ వేశారు. పిల్లులను చంపి, వాటి మాంసాన్ని హోటళ్లకు విక్రయిస్తోన్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠా గుట్టురట్టు చేశారు.
కన్నా అత్యుత్సాహం.. చిక్కుల్లో పడ్డ బీజేపీ
పిల్లి మాంసాన్ని హోటళ్లకు విక్రయించడం ఈ ముఠా ప్రధాన ఉద్దేశం. దేవుళ్లు, బాబాల ఫొటోలను పట్టుకుని, వీధి వీధంతా గాలిస్తుందీ ముఠా. పిల్లులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయో పసిగడుతుంది. అనంతరం వాటిని తీసుకెళ్లి, చంపి మాంసాన్ని హోటళ్లకు విక్రయిస్తూ వస్తోంది. ఈ ముఠా కార్యకలాపాలపై నిఘా ఉంచిన మూగజీవాల సంరక్షణ కోసం కృషి చేస్తోన్న విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్ సంస్థ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యానులో ఒక బతికున్న పిల్లితో పాటు మరో చచ్చిన పిల్లిని పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాలో ఉన్న ఆరుమందిని వలపన్ని మరీ పట్టుకున్నారు. ఆ ముఠా తిరుగాడే వ్యాన్ నుంచి పిల్లి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పోస్ట్ మార్టం కోసం పశు వైద్యశాలకు తరలించారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ఈ ముఠా ఇదివరకు ఒడిశాలో కూడా ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు తేలినట్లు తెలుస్తోంది. ఒడిశా-ఏపీ సరిహద్దుల్లోని గ్రామాల్లో పిల్లులను పట్టుకుని, వాటిని చంపి, మాంసాన్ని హోటళ్లకు విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పోలీసులు వెల్లడించారు.