Admin Capital:3నెలల్లో విశాఖకు: అంతర్జాతీయ డిజైన్లు వద్దే వద్దు: ఆంధ్రా వర్శిటీ, రుషికొండ ఐటీ పార్కు
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం, జనసేన పార్టీ, అమరావతి ప్రాంత రైతులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మరో ముందడుగు వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. వీలైనంత త్వరగా విశాఖపట్నం నుంచి పరిపాలనను కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం అవసరమైన భవనాలను అన్వేషిస్తోంది.
జాప్యం చేయకూడదంటూ..
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించడంలో ఎలాంటి జాప్యాన్ని చేయకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ నుంచి పరిపాలనను కొనసాగించడానికి సన్నాహాలు చేపట్టారని అంటున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి అప్పగించినట్లు తెలుస్తోంది. పరిపాలన సాగించడానికి అనువైన భవనాలను గుర్తించాలని సూచిస్తూ నీలం సాహ్నీ.. విశాఖపట్నం జిల్లా కలెక్టర్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మౌఖికంగా ఆదేశించినట్లు చెబుతున్నారు.
అందుబాటులో ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఐటీ పార్కులు..
ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఐటీ పార్కులకు చెందిన భవనాల నుంచి పరిపాలన కొనసాగించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు ఆంధ్రా యూనివర్శిటీతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ తో పాటు, శివార్లలో కొత్తగా ఏర్పాటైన ఐటీ పార్కులకు చెందిన భవనాలను అద్దెకు తీసుకుని వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చే అవకాశాలు లేకపోలేదు.
రుషికొండలో సచివాలయం..
రుషికొండలోని నిర్మితమైన మిలీనియం టవర్ ను సచివాలయంలో బదలాయించడానికి అవకాశం ఉంది. రుషికొండలో ప్రస్తుతానికి లక్ష చదరపు అడుగల విస్తీర్ణం అందుబాటులో ఉందని, దీన్ని సచివాలయంగా మార్చితే బాగుంటుందని గ్రేటర్ విశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి భారీగా అద్దె చెల్లించాల్సి ఉన్నందున ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ప్రభుత్వం ఆంధ్రా యూనివర్శిటీ భవనాల పైనే ఆధారపడొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
భారీ భవనాలు ఉండవ్..
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే క్రమంలో.. ప్రభుత్వం ఎలాంటి భారీ భవనాలు, ఆకాశా హర్మ్యాలను నిర్మించకపోవచ్చని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో చోటు చేసుకున్న తరహాలో అంతర్జాతీయ స్థాయి డిజైన్లు ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నట్లు సమాచారం. ఎలాంటి హడావుడి లేకుండా, పరిపాలనను సాఫీగా సాగించడానికి అందుబాటులో, అనువైన భవనాలు ఉంటే సరిపోతుందని వైఎస్ జగన్.. అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.