దద్దరిల్లుతోన్న విశాఖ ఏజెన్సీ: కొయ్యూరులో భారీ ఎన్కౌంటర్: ఆరుమంది మావోయిస్టులు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు తుపాకుల మోతతో మారుమోగుతున్నాయి.. దద్దరిల్లి పోతోన్నాయి. అనూహ్యంగా సంభవించిన ఈ పరిణామంతో గిరిజన గ్రామాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలోని కొయ్యూరు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో కనీసం ఆరుమంది మావోయిస్టులు మరణించి ఉండొచ్చని జిల్లా పోలీసులు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.
కాడెద్దుగా మారిన తెలంగాణ రైతు కుమారుడు: తొలకరి పలకరించినా..పొలం పనులకు దిగలేక
నర్సీపట్నం సమీపంలోని కొయ్యూరు అటవీ ప్రాంతంలో గల మంపా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారు జామున ఈ ఎదురు కాల్పులు ఆరంభమైనట్లు విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బీవీ కృష్ణారావు తెలిపారు. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. మావోయిస్టుల కోసం నిర్వహిస్తోన్న కూంబింగ్లో భాగంగా కొయ్యూరు సమీపంలోని అడవుల్లోకి వెళ్లిన గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారని, వారిని లొంగిపోవాలంటూ హెచ్చరించగా.. కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
దీనికి ప్రతిగా గ్రేహౌండ్స్ జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుమంది మావోలు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నట్లు సమాచారం ఉందని ఎస్పీ బీవీ కృష్ణారావు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే-47, ఎస్ఎల్ఆర్-1, కార్బైన్-1, మూడు పాయింట్ 303 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. ఈ ఘటన అనంతరం గ్రేహౌండ్స్ బలగాలు కొయ్యూరు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. అదనపు బలగాలను పంపించినట్లు సమాచారం.