ఉలిక్కిపడ్డ విశాఖపట్నం: భారీ అగ్నిప్రమాదం: అలముకున్న పొగ: దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి
విశాఖపట్నం: విశాఖపట్నంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్క్రాప్ యార్డ్లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఆకాశాన్నంటుకునేలా దట్టమైన పొగ వెలువడింది. దుర్వాసన స్థానికులను ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా విభాగం, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులో చేయడంలో నిమగ్నమయ్యారు.
సెకెండ్ వేవ్ దెబ్బ..గట్టిగా: తెలంగాణలో 20 వేలకు పైగా: సింగిల్ డేలో 3,000 ప్లస్
విశాఖపట్నం శివార్లలోని దువ్వాడలో గల సెజ్లోని ఓ స్క్రాప్ యార్డ్లో ఈ ఘటన సంభవించింది. దువ్వాడ సెజ్లో చాలాకాలంగా పూజ స్క్రాప్యార్డ్ పేరుతో అది కొనసాగుతోంది. విశాఖ నగరంలో సేకరించిన స్క్రాప్, ఇతర వ్యర్థ వస్తువులను ఈ యార్డ్లో పోగేస్తుంటారు. సేకరించిన స్క్రాప్ను ముంబై వంటి నగరాలకు ఎగుమతి చేస్తుంటారు. వాటిని భద్రపరచడంతో పాటు ఇతర కార్యకలాపాల కోసం యార్డ్లో భారీ గౌడన్లను నిర్మించారు. ఈ మధ్యాహ్నం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. తొలుత దట్టమైన పొగ వెలువడింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. స్క్రాప్ యార్డ్లో ఉన్న గోడౌన్లకు మంటలు వ్యాపించాయి.
వెంటనే యార్డ్సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నికీలలు నియంత్రించడానికి శ్రమించారు. రసాయనాలు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థ వస్తువుల నుంచి పొగ వెలువడటం వల్ల దువ్వాడ సెజ్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపించింది. స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. లక్షల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని పూజ స్క్రాప్ యార్డ్ యాజమాన్యం అంచనా వేస్తోంది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించినట్లు ప్రాథమికంగా ఎలాంటి వార్తలు అందలేదు.