విశాఖకు తరలివెళ్లనున్న తొలి కార్యాలయం అదే: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సహా అన్నీ ఆ తరువాతే
విశాఖపట్నం: ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించిన విశాఖపట్నానికి తరలి వెళ్లడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. తరలింపులో జాప్యం చేయకూడదనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది. వీలైనంత వేగంగా శాఖల తరలింపు పనులను చేపట్టడానికి అన్ని శాఖలు ప్రాథమిక సన్నాహాలు చేస్తున్నాయి. దీనికోసం ముందుగా తరలి వెళ్లాల్సిన కార్యాలయాల జాబితాను ప్రభుత్వం రూపొందించనున్నట్లు చెబుతున్నారు.
ఏపీ వచ్చే వారికి గుడ్ న్యూస్- ఈ-పాస్ జారీలో సర్కార్ మార్పులు..
పోలీసు శాఖతో ఆరంభం..
శాసన రాజధాని అమరావతి ప్రాంతం నుంచి తొలిగా పోలీసు శాఖ పరిపాలన రాజధానిలో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్భవన్, సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వివిధ విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖపట్నానికి తరలి రానున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి భద్రతా చర్యలను పర్యవేక్షించాల్సి ఉంది. దీనితో- అన్నిటికంటే ముందుగా పోలీసు శాఖ, పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయం విశాఖకు తరలివెళ్లడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ అడుగు ముందే ఉన్నారు.
హైపవర్ కమిటీ ఏర్పాటు..
విశాఖలో తీసుకోవాల్సిన భద్రతాచర్యలపై ఆయన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సీనియర్ అధికారులను ఇందులో సభ్యులుగా చేర్చారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం ఓఎస్డీ, పోలీసుల శిక్షణా విభాగం ఇన్స్పెక్టర్ జనరల్, పర్సనల్ సెల్ ఐజీ, ఇంటెలిజెన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఐజీ, టెక్నికల్ సెల్ డీఐజీతో హైపవర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఈ నెల 14వ తేదీలోగా తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డీఐజీకి అందజేయాల్సి ఉంటుంది.
పలుమార్లు సందర్శించిన గౌతమ్ సవాంగ్..
మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందక ముందు నుంచే డీజీపీ గౌతం సవాంగ్ పలుమార్లు విశాఖపట్నంలో పర్యటించారు. పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన సముదాయాల గురించి ఆయన అన్వేషణ కొనసాగించారు. పలు ప్రాంతాలను సందర్శించారు. పలుచోట్ల పర్యటించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రుషికొండ, ఆనందపురం, పెందుర్తి సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొట్లకొండ, మధురవాడ ప్రాంతాల్లో గల ఖాళీ స్థలాల గురించి ఆరా తీశారు.
Recommended Video
గ్రేహౌండ్స్ కార్యాలయంలో..
తొట్లకొండలోని గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల సమీపంలో గల సింహపురి కాలనీని కూడా గౌతం సవాంగ్ సందర్శించారు. ఈ ప్రాంతంలో భూములు ఖాళీగా ఉన్నాయని జీవీఎంసీ అధికారులు ఆయనకు తెలిపారు. పోలీసు కార్యాలయాల నిర్మాణానికి అనువైనవా? కాదా? అనే విషయంపై డీజీపీ ఆరా తీసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందపురం మండలంలో గ్రేహౌండ్స్ విభాగానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్నీ డీజీపీ పరిశీలించారు. రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయాన్ని ఆనందపురంలో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.