సచివాలయం లోకేషన్ ఛేంజ్: మిలీనియం టవర్ కాదట: మాజీ ముఖ్యమంత్రి అల్లుడి కాలేజీలో..?
విశాఖపట్నం: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా అవతరించబోతోన్న విశాఖపట్నంలో భవనాల వెదుకులాటకు ఇంకా తెర పడట్లేదు. పరిపాలనను కొనసాగించడానికి అనువైన భవనాల కోసం అధికార యంత్రాంగం కొనసాగిస్తోన్న అన్వేషణ ఓ కొలిక్కి రావట్లేదు. ఇప్పటిదాకా మధురవాడ, రుషికొండ సమీపంలోని మిలీనియం టవర్స్ను సచివాలయంగా మార్చుకోవచ్చంటూ వార్తలు వెలువడినప్పటికీ..అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. పరిశీలనలో మాత్రమే ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఏపీ: ఇన్వెస్ట్ ఇండియా వెల్లడి
పైడా కౌశిక్ కాలేజీ భవన సముదాయం పరిశీలన..
ఈ పరిస్థితుల్లో మరో కొత్త పేరు తాజాగా వినిపిస్తోంది. అదే- పైడా కౌశిక్ ఇంజినీరింగ్ కళాశాల భవన సముదాయం. సచివాలయంగా ఈ కళాశాల భవన సముదాయాన్ని బదలాయించడానికి గల సాధ్యసాధ్యాలపై రెండురోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండుసార్లు ఈ కళాశాల భవన సముదాయాలను పరిశీలించారు. దీనితో సచివాలయం కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఎవరిదా కళాశాల..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అల్లుడిది ఆ కళాశాల. రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్కు చెందినది. తన కుమారుడు పైడా కౌశిక్ పేరు మీద ఈ కళాశాలను స్థాపించారు. విశాఖపట్నం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో భీమిలీకి దగ్గరగా ఉంటాయి ఈ కళాశాల భవనాలు. భీమిలీ శివార్లలోని ఆనందపురం సమీపంలోని గంభీరం గ్రామంలో దీన్ని నిర్మించారు. సుమారుగా 40 ఎకరాల విస్తీర్ణంలో 2002లో దీన్ని నిర్మించారు.
మూడేళ్లుగా నిరుపయోగంగా..
కారణాలు ఏమైనప్పటికీ.. సుమారు మూడేళ్లుగా ఈ కళాశాల నడవట్లేదు. దాదాపుగా మూతపడింది పైడా కౌశిక్ ఇంజినీరింగ్ కళాశాల. విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ భవనం ఖాళీగా ఉంది..నిరుపయోగంగా ఉంటోంది. ఈ భవనాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చాలనే ప్రతిపాదనను భీమిలీ ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. దీనికి వైఎస్ జగన్ అంగీకరించారని, ఓ సారి చూసి రావాలంటూ తన కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ను ఆదేశించారని, పలితంగా- రెండుసార్లు ఈ భవనాన్ని పరిశీలించారని అంటున్నారు.
మిలీనియం టవర్-బీ నిర్మాణం పూర్తికాకపోవడం వల్లే..
నిజానికి- ఉగాది నాటికి లేదా.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడం ఖాయమైంది. మంత్రులు కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే విశాఖకు తరలివెళ్లబోతోంది సచివాలయం. మిలీనియం టవర్స్కు సచివాలయాన్ని తరలించాలని భావించినప్పటికీ.. టవర్-బీ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమౌతోంది.
Recommended Video
జాప్యం చేయకూడదనే ఉద్దేశంతోనే..
సచివాలయాన్ని తరలించడంలో ఎలాంటి జాప్యాన్ని చేయకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకే మిలీనియం టవర్-బీ నిర్మాణ పనులు పూర్తికానప్పటికీ విశాఖకు తరలి వెళ్లక తప్పదని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ భవనాలను చూడాల్సి వచ్చిందని అంటున్నారు అధికారులు. అందుకే- ఖాళీగా ఉన్న కౌశిక్ ఇంజినీరింగ్ కాలేజీ భవన సముదాయాలను తాత్కాలిక అవసరాల కోసం సచివాలయంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.