విశాఖలో దారుణం: అక్రమ సంబంధంతో పుట్టిన శిశువు విక్రయం: రాకెట్ కింగ్పిన్గా డాక్టర్లు
విశాఖపట్నం: విశాఖపట్నంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన శిశువులను అక్రమంగా రవాణా చేసే రాకెట్ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఆశా వర్కర్లు సహా ఆరుమందిని అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా ఈ రాకెట్ నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పీ నమ్రత ఈ రాకెట్కు కింగ్ పిన్గా నిర్ధారించారు.
ఆరుమంది అరెస్టు..
ఆమెతో పాటు అదే ఆసుపత్రిలో పని చేస్తోన్న డాక్టర్ తిరుమల, వీ మాడుగుల మండలానికి చెందిన ఇద్దరు ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ వెంకటలక్ష్మి అల్లుడు రామకృష్ణ, చంద్రమోహన్లను అరెస్టు చేశారు. శిశువులను కొనుగోలు చేసిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. డాక్టర్ నమ్రతను బెంగళూరులో అరెస్టు చేసి, విశాఖపట్నానికి తరలించారు.
అక్రమ సంబంధంతో గర్భం..
వీ మాడుగుల మండలానికి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట భర్త మరణించాడు. దీనితో ఆమె అదే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న మాడుగుల మండలానికే చెందిన ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ ఆ మహిళను కలిశారు. బిడ్డను తమకు ఇచ్చేస్తే కాన్పు ఖర్చులను తామే భరిస్తామని, కొంత డబ్బు కూడా ఇస్తామని ఆశ పెట్టారు. దీనికి ఆమె అంగీకరించింది.
యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిలో..
ఈ విషయాన్ని వెంకటలక్ష్మి అల్లుడు రామకృష్ణ యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్ నమ్రతకు తెలిపాడు. ఈ రాకెట్కు ఆమె అంగీకరించారు. ఈ ఏడాది మార్చి 9న యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిలో ఆమె మగబిడ్డను ప్రసవించారు. అనంతరం ఆ బిడ్డను కోల్కతకు చెందిన దంపతులకు విక్రయించారు. దీనికోసం నకిలీ బర్త్ సర్టిఫికెట్ను పుట్టించారు. బిడ్డకు సియాన్ రాయ్గా అందులో పొందుపరిచారు. కోల్కోతలోని బ్రాంచ్ ఆసుపత్రి ద్వారా పిల్లలు లేని దంపతులకు విక్రయించారు.
ఆంగన్వాడీ టీచర్కు అనుమానం రావడంతో..
బిడ్డను విక్రయించిన మహిళ గర్భంతో ఉన్నసమయంలో ఆమెకు ఐసీడీఎస్ పౌష్టికాహారం లభించేది. స్థానిక ఆంగన్వాడీ టీచర్ సరోజినీ స్వయంగా ఆమెకు పౌష్టికాహారాన్ని అందించే వారు. కాన్పు తరువాత సరోజినీ బిడ్డ గురించి ఆరా తీయగా.. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీనితో అనుమానం వచ్చిన సరోజినీ.. అదే నెల 14వ తేదీన చైల్డ్ లైన్కు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన చైల్డ్లైన్ సిబ్బంది చేపట్టిన విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న డాక్టర్ నమ్రత అసిస్టెంట్ చంద్రమోహన్.. కోల్కతకు వెళ్లి శిశువును తీసుకొచ్చాడు. చైల్డ్లైన్ సిబ్బందికి అప్పగించాడు.
ఇదివరకే రెండు క్రిమినల్ కేసులు..
అనంతరం చైల్డ్లైన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్న పిల్లల అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారాన్ని సేకరించిన తరువాత నిందితులను అరెస్టు చేశారు. ఇదివరకు సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్ పేరు మీద ఈ ఆసుపత్రికి కొనసాగిందని, రెండు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పేరు మార్చారని పోలీస్ కమిషనర్ మీనా తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్కతల్లో ఈ ఆసుపత్రికి బ్రాంచిలు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు.
మెడికల్ క్యాంపులను నిర్వహించి..
డాక్టర్ నమ్రత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా ఒడిశాలోని మారుమూల గ్రామాల్లో మెడికల్ క్యాంపులను నిర్వహించే వారని, ఈ సందర్భంగా బిడ్డను పోషించలేని స్థితిలో ఉన్న గర్భిణులను గుర్తించి, శిశువులను కొనుగోలు చేసే వారని తెలిపారు. దీనికోసం ఆమె కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకున్నట్లు చెప్పారు. బిడ్డను కొనుగోలు చేసిన తరువాత తమకు ఉన్న బ్రాంచ్ ఆసుపత్రుల ద్వారా పిల్లలు లేని దంపతులను గుర్తించి, విక్రయించే వారని తెలిపారు.