ఎల్జీ పాలిమర్స్ మరో మరణం..! 13కి పెరిగిన వైజాగ్ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య.!
అమరావతి/హైదరాబాద్ : విశాఖ విష మరణాలు దారుణ విషాదం మరువక ముందే మరో విచారకర సంఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణం గ్యాస్ లీక్ దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వెంకాయమ్మ అనే మరో మహిళ మృతిచెందింది. దీంతో వైజాగ్ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య 13కి పెరిగింది.
అత్యంత నిరుపేదలే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా జరిగిన సంఘటన పట్ల న్యాయ విచారణ అవసరం లేదంటూ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ ఎల్జీ పాలిమర్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా అత్యున్నత న్యాయ స్థానం స్పందించింది. ఇక గతంలో మృతులకు కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం మరి 13వ మృతురాలి కుటుంబానికి ఏమేరకు ఆర్థిక సాయం అందిస్తుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మృతురాలు వెంకాయమ్మకు కూడా కోటి రూపాయల ఆర్థిక సాయం అందివ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా వెంకాయమ్మ చికిత్స పొంది ఆరోగ్యం కాస్త కుదుటపడిందన్న కారణంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయ్యి ఇంటికి వెళ్లి పోయింది. తర్వాత వ్యాధి తిరగదోడి ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా మారింది. ఆ వెంటనే ఆసుపత్రిలో చేరిన వెంకాయమ్మ అనుకోని పరిస్థితుల్లో వచ్చి మృతిచెందారని వైద్యులు దృవీకరిస్తున్నారు.
మరి ఈ మరణాన్ని గ్యాస్ మృతి కింద లెక్కగడతారా లేదా అన్నదే సందేహం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా విష వాయువు వెదజల్లిన కంపెనీని మూసివేయాల్సిందిగా ఆదేశాలిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు నిచ్చింది. ఎల్జీ పాలిమర్స్ తీవ్రమైన తప్పులు చేసినట్టు అర్థమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ ను న్యాయమూర్తులు మళ్లీ మందలించారు. ప్రస్తుతం ఎన్జీటీ, హైకోర్టు నియమించిన విచారణ కమిటీలు దర్యాప్తు చేస్తున్నాయి.