మరో హిందూ దేవాలయంపై దాడి... ట్విట్టర్లో బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి పోస్ట్..
ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఓవైపు ఈ దాడులను ఖండిస్తూ విపక్ష పార్టీల నిరసనలు,ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే... మరోవైపు దుండగులు తమ పని తాము చేసుకుపోతున్నారు. తాజాగా విశాఖపట్నంలోని గణపతి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు విగ్రహం చేయి ధ్వంసం చేశారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
'ఆంధ్రప్రదేశ్లో మరో హిందూ దేవాలయంపై దాడి. హిందూ వ్యతిరేక శక్తులు విశాఖపట్నంలోని గణపతి విగ్రహ చేతిని ధ్వంసం చేశాయి. ఇలాంటి గూండాలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి ముఖ్యమంత్రి జగన్ తామే బాధితులం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.' అని విష్ణు వర్దన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం విజయవాడలోని నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉన్న హిందూ దేవాలయంలో సీతాదేవీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Another attack on Hindu Temple in Andhra Pradesh. Anti hindu forces cut off Lord Ganesha’s hand in Visakhapatnam.
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) January 6, 2021
Instead of acting against such goons, CM @ysjagan garu is busy playing victim card.#SaveAndhraTemple pic.twitter.com/VP5ChifLhh
విజయనగరం జిల్లా రామతీర్థంలోని రాముడి విగ్రహ ధ్వంసంపై గత కొద్దిరోజులుగా రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మరోసారి ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడే రీతిలో చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఈ దాడులకు తెరపడట్లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ దాడుల వెనుక టీడీపీ కుట్ర దాగుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.