ఏపీలో విశాఖ వేదికగా పాలన: ముహూర్తం ఫిక్స్..విశాఖకు వెళ్లేందుకు రెడీ అవుతున్న సచివాలయ సిబ్బంది !!
సీఎం జగన్ పరిపాలనా రాజధానిగా విశాఖను ఏర్పాటు చెయ్యాలని దాదాపు సంవత్సరం పైగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . పట్టు పట్టరాదు ..పట్టి విడువరాదు అన్న చందంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకే మొదటి నుండి చాలా పట్టుదలతో ఉన్నారు . అన్నిటికంటే విశాఖ నుండి పాలన సాగించాలని ఆయన చాలా మొండిగా ఉన్నారు. ఏపీ సర్కార్ విశాఖను పరిపాలన రాజధానిగా చేసి, విశాఖ నుండి పరిపాలన సాగించాలని చేస్తున్న ప్రయత్నాలు ఈ ఏడు సాకారం అయ్యే అవకాశం ఉందని బొత్సా సత్యన్నారాయణ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంలో సచివాలయ సిబ్బంది కూడా విశాఖ వెళ్లేందుకు రెడీ అంటున్నారు. అధికారిక ఉత్తర్వే తరువాయి అంటున్నారు.
ఏప్రిల్ 13 నుండి విశాఖపట్నం నుండి పరిపాలన సాగించే అవకాశం
2021లో తెలుగు సంవత్సరాది ఉగాది, ఏప్రిల్ 13 నుండి విశాఖపట్నం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన పనిచేసే అవకాశం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 13 న వచ్చే తెలుగు నూతన సంవత్సర దినోత్సవం ఉగాది నుండి విశాఖపట్నం రాష్ట్ర పరిపాలనా రాజధానిగా పనిచేయడం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు.
ఏప్రిల్ 13 నుండి చట్టబద్దంగా ఆంధ్రప్రదేశ్ యొక్క కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ
విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఏప్రిల్ 13 నుండి విశాఖపట్నం చట్టబద్దంగా ఆంధ్రప్రదేశ్ యొక్క కార్యనిర్వాహక రాజధానిగా ఉంటుంది. ఆ తేదీ నుండి ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖ నుండి పనిచేయడానికి మేము సన్నద్ధమవుతున్నాము అని స్పష్టం చేశారు. అప్పటికి అన్ని చట్టపరమైన అడ్డంకులను అధిగమించగలమని మేము ఆశిస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కొత్త భవనాలు నిర్మించే వరకు, విశాఖపట్నంలో కార్యాలయాలకు తగిన భవనాలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని సచివాలయంలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. మార్చి చివరి నాటికి వారు విశాఖ వెళ్లేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.
విశాఖ వెళ్ళటానికి సిద్ధం అంటున్న సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా విశాఖపట్నానికి మారడానికి సమాయత్తమవుతోంది. అయితే తమకు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని , అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తే విశాఖపట్నం వెళ్లడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని అసోసియేషన్ అధ్యక్షుడు కె వెంకట్రామి రెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఏప్రిల్లో విశాఖపట్నం మార్చడం సౌకర్యంగా ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగులు తమ పిల్లల విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అమరావతి నుండి కొత్త రాజధానికి వెళ్లడానికి ఇది చాలా అనువైన సమయం అని వారు అభిప్రాయపడుతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు లక్ష్యంతో జగన్ సర్కార్
ప్రస్తుత రాజధాని నగరమైన అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించి, న్యాయ రాజధానిగా కర్నూలుకు స్థానం కల్పించి, 2019 డిసెంబర్లో జగన్ ప్రభుత్వం విశాఖపట్నంను రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. 2020 జూన్ 16 న, రాష్ట్ర శాసనసభ రెండు బిల్లులను ఆమోదించింది . రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలను సృష్టించే లక్ష్యంతో ఏపి వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లు, 2020 , ఎపి కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (రిపీల్) బిల్లును ఆమోదింపజేసి అనుకున్నట్టు మూడు రాజధానుల ఏర్పాటు చెయ్యాలని భావించింది. కానీ ఈ బిల్లులు శాసనమండలి ఆమోదం పొందలేదు .
రాజధాని మార్పు అడ్డుకోవటానికి చట్టపరమైన చిక్కులు .. తొలగిపోతే రాజధాని మార్పు
ఆ తర్వాత ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయడం వంటి అనేక గందరగోళాల మధ్య ఇప్పటివరకు విశాఖ పరిపాలన రాజధానిగా ఏర్పాటు ప్రక్రియ జగన్ సర్కార్ రెండడుగులు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి లాగినట్లు గానే నడుస్తుంది. 2020 జూలై 31వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు బిల్లులపై ఆమోదముద్ర వేసి మూడు రాజధానులు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు.
అయితే రాజధాని మార్పు నిలిపివేయడానికి అమరావతి రైతులు 90 కి పైగా వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. రెండు బిల్లులు చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్నాయి. ఇక ఈ వివాదం కోర్టులో ఉన్న కారణంగా రాజధాని మార్పు ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఈ ఏడాది ఉగాదికి చట్టపరమైన చిక్కులన్నీ తొలగిపోతే రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టాలని ఆలోచనలో జగన్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.