సిట్టింగ్ జడ్జితో విచారణ: ఆలయాల కూల్చివేత: మసీదును తొలగించే దమ్ము లేదా?: సోము ఫైర్
విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన కల్యాణ రథం కాలిపోయిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని అన్ని రాజకీయ పార్టీలూ ప్రభుత్వంపై దాడికి దిగాయి. తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అసమ్మతి గళం వినిపించింది. తిరుగుబాటు ఎంపీగా గుర్తింపు పొందిన రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే తన అభిప్రాయమేంటో తెలియజేశారు.
భారత్తో మాటల యుద్ధం: ఇండియన్ ఆర్మీ డేంజరస్ మూవ్: మా వాళ్లు మంచోళ్లు: చైనా
సిట్టింగ్ జడ్జితో విచారణ..
తాజాగా- ఈ ఘటనపై న్యాయ విచారణ కోసం బీజేపీ పట్టుబట్టుతోంది. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. నిజనిజాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా హిందుత్వంపై దాడులు చోటు చేసుకుంటున్నాయని, దీన్ని తాము ఏ మాత్రం సహించబోమని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకాల విషయంలో గానీ, శ్రీశైలం దేవస్థానం షాపుల కేటాయింపుల్లో నిజాలను నిర్దారించడానికి కమిటీని వేస్తామని అన్నారు.
డబుల్ ఫొటోలుగా..
మంగళవారం ఆయన విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హిందూయేతర మతాలను ప్రోత్సహించడంలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ డబుల్ ఫొటోలుగా మారాయని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గానీ.. జగన్ సర్కార్లో గానీ చర్చిల నిర్మాణానికి జిల్లా స్థాయిలో క్రైస్తవ కమిటీలకు నిధులను మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పిచ్చివాళ్లకు ఆటస్థలమా?
హిందు దేవాలయాలపై దాడులు సంభవించిన ప్రతీసారీ పిచ్చివాళ్లు, పిచ్చి చేష్టలు అనే అంశాన్ని తెరమీదికి తీసుకొస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలంటే పిచ్చివాళ్లకు ఆటస్థలంగా మారిందా? అని ఆయన నిలదీశారు. క్రైస్తవులకు ఏసుప్రభువు-బైబిల్, ముస్లింలకు అల్లా-ఖురాన్ మాత్రమేనని, హిందుత్వం అలా కాదని అన్నారు. కోటానుకోట్ల దేవుళ్లను హిందువులు పూజిస్తారని అన్నారు. చెట్టు, పుట్టలను పూజిస్తారని చెప్పారు. భారతీయత అంటే అదేనని అన్నారు. అలాంటి హిందుత్వను కించపరిచే చర్యలను బీజేపీ సహించబోదని అన్నారు.
టీడీపీ ఏం హక్కు ఉంది?
అంతర్వేది ఘటనపై తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేయడాన్నిసోము వీర్రాజు తప్పుపట్టారు. కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే దేవాలయాలను కూల్చేసిందని గుర్తు చేశారు. హిందుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుతోన్న టీడీపీ నేతలు అప్పుడేం అయ్యారని ప్రశ్నించారు. విజయవాడ సమీపంలో గోశాలను సందర్శించడానికి వెళ్లిన తమ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీకి నాయకత్వాన్ని వహిస్తోన్న నిమ్మకాయల చినరాజప్ప అప్పుడు దీని గురించి ఎందుకు స్పందించలేదని చెప్పారు.
Recommended Video
మసీదులను తొలగించే దమ్ము ఉందా?
అడ్డంగా ఉన్నాయని హిందూ ఆలయాలను కూల్చేసిన ప్రభుత్వాలకు మసీదులను తొలగించే దమ్ము ఉందా? అని సవాల్ విసిరారు. చినరాజప్ప భాగస్వామ్యిగా ఉన్న ప్రభుత్వ హయాంలోనే వందలాది ఆలయాలను కూల్చేశారని అన్నారు. తమ ప్రభుత్వం ఉంటే ఒకరకంగా.. వేరొకరి ప్రభుత్వం ఉంటే ఇంకోరకంగా టీడీపీ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. హిందుత్వంపై దాడిని ప్రశ్నించే హక్కు, అర్హత ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.