రాజధానిపై బీజేపీ గేమ్ప్లాన్: టార్గెట్ టీడీపీ -సోము వీర్రాజు అనూహ్య వ్యాఖ్యలు - అమరావతేనన్న జీవీఎల్
వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారం కోర్టుల పరిధిలోనూ ఉంది కాబట్టి కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుందని కొందరు... అసలు కేంద్రానికేమాత్రం సంబంధం లేదని ఇంకొందరు... సరైన సమయంలో మోదీ సరైన నిర్ణయం తీసుకుంటారని మరికొందరు... తీరా బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారనగా.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయమే ఆరా తీసిందని.. సమగ్ర వివరాలు సేకరించిందంటూ అనూహ్య కథనాలు... వెరసి ఏపీలో మూడు రాజధానుల విషయంలో బీజేపీ నేతలు కొట్టినన్ని పల్టీలు, చేసినన్ని విరుద్ధ వ్యాఖ్యలు ఇతర పార్టీలకు సాధ్యం కాలేదు.
రాజధాని కథ ముగియలేదు: జగన్కు నేతల సవాల్ - ఇప్పుడే వద్దన్న వైవీ సుబ్బారెడ్డి - లోకేశ్ శపథం
టార్గెట్ టీడీపీ..
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రెండు బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంతం నెగ్గినట్లయింది. అయితే ఈ వ్యవహారంలో గేమ్ ప్లాన్ మాత్రం బీజేపీదే అని, టీడీపీని దెబ్బ తీయడమే టార్గెట్ గా కేంద్రంలోని కాషాయదళం కదిపిన పావుల్లో భాగమే రాజధాని బిల్లులకు క్లియరెన్స్ అనే వాదన బలంగా వినిపిస్తోంది. నిన్నటిదాకా రాజధానితో మాకు సంబంధం లేదని వక్కాణించిన నేతలంతా ఇప్పుడు అమరావతి జపం చేస్తుండటం.. అందులోనూ మళ్లీ చంద్రబాబుపైనే విమర్శలు కురిపిస్తుండటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలిచాయి.
జాతీయ విద్యా విధానంపై ఆర్ఎస్ఎస్ ముద్ర - 60 శాతం సూచనలు సంఘ్ సంస్థలవే
రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయమది..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు రూట్ క్లియర్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో స్పందనలు వెలువడుతున్నవేళ.. ఏపీ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా ఏపీ ప్రభుత్వానిదేనని, బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో భాగమని, ఆయన రాజకీయ వ్యవస్థలో భాగం కాదని పేర్కొన్నారు.
పార్టీ నిర్ణయం మాత్రం వేరే..
రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై తాను రాజకీయాలు చేయబోమన్న సోము.. పార్టీ పరంగా తాము మాత్రం ఏపీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రాజధానికి మద్దతు తెలిపామని, రాష్ట్ర బీజేపీ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్నామని, వారికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమన్నారు. రాజధాని రైతుల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అమరావతికే బీజేపీ జై
గవర్నర్ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్ కే బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని తమ పార్టీ తీర్మానం కూడా చేసిందని, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నదీ తామేనని ఆయన గుర్తుచేశారు. అదేసమయంలో టీడీపీ పేరెత్తకుండా.. ‘‘కొందరు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను ప్రశ్నిస్తారు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆధికారాలు లేవని అంటుంటారు’’అని చంద్రబాబును ఉద్దేశించి జీవీఎల్ ఎద్దేవా చేశారు.
మూడు రాజధానుల అంశాన్ని
‘‘మూడు రాజధానుల అంశంపై గతంలోతెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని పార్లమెంటులో లేవనెత్తారు.ఆ సందర్భంలో కేంద్ర హోంశాఖ చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. రాజధాని అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని అంశమని, దాంట్లో కేంద్రం జోక్యం ఉండబోదని క్లారిటీగా తెలిపింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండబోదని పార్టీ పరంగానూ మేం చెబుతూ వస్తున్నాం.అయితే, ఒకవేళ రాష్ట్రంగానీ మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వం వద్దకు వస్తే.. దాన్ని వ్యతిరేకించే అవకాశం కేంద్రానికి లేదన్నది సుస్పష్టం’’అని జీవీఎల్ వివరించారు.
Recommended Video
బీజేపీ టార్గెట్ టీడీపీ..
రాజధానిగా అమరావతే కొనసాగాలన్నది బీజేపీ విధానమే అయినా, భూసేకరణలో చంద్రబాబు సర్కారు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని, రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఉందని బీజేపీ వాదిస్తున్నది. రాజధాని అమరావతిలోనే ఉండాలని గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని, మిగతా పార్టీలు విధానాలు మార్చుకున్నా, బీజేపీ మాత్రం ఇప్పటికీ అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని, రాజధాని కోసం 33 వేల ఎకరాల భూముల్ని ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలన్నదే బీజేపీ అభిమతమని సోము వీర్రాజు, జీవీఎల్ స్పష్టం చేశారు. అమరావతితో టీడీపీ స్వార్థ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వక్కాణించారు. కేవలం శాసన రాజధానిగా అమరావతి ఉంటే సరిపోదని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనివైసీపీని డిమాండ్ చేస్తామనీ బీజేపీ నేతలు చెప్పారు.