ట్రయాంగిల్ లవ్స్టోరీ? జగన్ను కలవరపరిచిన గాజువాక హత్యోదంతం: రూ.10 లక్షల సాయం: సుచరితకు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాక శనివారం రాత్రి జరిగిన హత్యోదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కలవరపరిచింది మొన్నటికి మొన్న విజయవాడలో దివ్య తేజస్విని తరహాలోనే మరో యువతి.. ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురి కావడం పట్ల వైఎస్ జగన్ ఆందోళనను వ్యక్తం చేశారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్కు కీలక ఆదేశాలను జారీ చేశారు. మృతురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి సుచరితను ఆదేశించారు.
గాజువాకలో ఏం జరిగింది?
గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో నివాసం ఉండే వరలక్ష్మి అనే 17 సంవత్సరాల యువతి రాత్రి హత్యకు గురయ్యారు. ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేసిన అఖిల్ సాయి వెంకట్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో వరలక్ష్మిని కత్తితో నరికేశాడు. రాత్రి 9.30 గంటల సమయంలో సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిల్ సాయి స్నేహితుడు రాము..కిందటి రాత్రి వరలక్ష్మికి ఫోన్ చేశాడు. సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా కోరాడు. అక్కడికి వచ్చిన వరలక్ష్మితో అఖిల్సాయి గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడ నరికాడు.
అంతకుముందే అన్నకు ఫోన్..
సాయిబాబా ఆలయానికి వెళ్లిన వరలక్ష్మి.. అక్కడ అఖిల్ సాయిని చూసిన వెంటనే ప్రమాదాన్ని శంకించారు. తన సోదరుడికి ఫోన్ చేసి, వెంటనే గుడి రావాల్సిందిగా కోరారు. అతను వచ్చేటప్పటికే అఖిల్ సాయి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వరలక్ష్మి ఫోన్ కాల్ అందుకున్న అతను బైక్పై తండ్రి గురునాథరావుతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాడు. అప్పటికే ఆమె ఆలయం వద్ద రక్తపుమడుగులో కనిపించారు. సంఘటనా స్థలంలోనే ఉన్న అఖిల్ సాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొనఊపిరితో ఉన్న వరలక్ష్మిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
లవ్ ఎఫైరే కారణం?
నిందితుడు అఖిల్ సాయి ఈ ఘాతుకానికి పాల్పడటానికి ప్రధాన కారణం.. ప్రేమ వ్యవహారమేనని అనుమానిస్తున్నారు. ఏడాదికాలంగా అతను ప్రేమ పేరుతో వరలక్ష్మిని వేధింపులకు గురి చేస్తున్నాడని, కుటుంబ సభ్యుల ద్వారా అతణ్ని మందలించినప్పటికీ.. ఫలితం లేదని చెబుతున్నారు. గురునాథ రావు ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిల్ సాయి వెంకట్తో పాటు అతనికి సహకరించిన రామును అరెస్టు చేశారు. కొంతకాలంగా వరలక్ష్మి.. తన స్నేహితుడు రాముతో సన్నిహిత్యంగా ఉండటం వల్లే ఆమెను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
సీఎస్కు ఫోన్..
ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరలక్ష్మి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి సుచరితకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దిశ యాప్పై అవగాహన కల్పించాలని అన్నారు.