విశాఖకు వైఎస్ జగన్: రాజధాని తరలింపు ప్రకటనకు ఛాన్స్: టీడీపీ అసహనానికి కారణం అదేనా?
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన కార్యరూపాన్ని దాల్చట్లేదు. దీనికి కారణాలు చాలానేే ఉన్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తరలింపును అడ్డుకోవడానికి హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలకు సారథ్యాన్ని వహిస్తోంది.
జాప్యం నెలకొన్న వేళ..
వైఎస్ జగన్.. ఈ ప్రకటన చేసిన మరుసటి సంవత్సరమే ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, దేశం మొత్తం సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లోకి వెళ్లడం వంటి పరిణామాలు కూడా మూడు రాజధానుల ఏర్పాటు కార్యక్రమాన్ని తాత్కాలికంగా అటక ఎక్కేలా చేశాయి. ఇలా అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంది జగన్ సర్కార్. వెరసి- మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన ప్రతిబంధకంగా మారింది. మూడు రాజధానుల అంశాన్ని దాదాపు మరిచిపోయినట్టయింది.
విశాఖకు వైఎస్ జగన్..
ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్.. విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. భవిష్యత్ పరిపాలన రాజధానిగా గుర్తింపు పొందిన సాగర నగరంలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీన ఆయన విశాఖలో పర్యటిస్తారని తెలుస్తోంది. జిల్లాలోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ శాసన సభ్యుడు కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరు కావాల్సి ఉంది. అనంతరం వైఎస్ జగన్ విశాఖలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మరి కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు.
రూ.330 కోట్లు రూపాయలతో..
సుమారు 330 కోట్ల రూపాయల వ్యయంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మూడు అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేశారు. వాటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ మూడు ప్రాజెక్టులను వైఎస్ జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును జీవీఎంసీ అధికారులు నిర్మించారు. 280 కోట్ల రూపాయలను దీనికి వ్యయం చేశారు. 23వ తేదీన వైఎస్ జగన్ దీన్ని ప్రారంభిస్తారు.
మల్టీ లెవెల్ కార్ పార్కింగ్.. వుడా పార్క్
దీనితోపాటు- 33 కోట్ల రూపాయలతో బీచ్ రోడ్లో పునరుద్ధరించిన పార్క్ను వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పార్కును పునరుద్ధరించింది. జగదంబా జంక్షన్లో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. దీని నిర్మాణ వ్యయం 11 కోట్ల రూపాయలు. ఈ మేరకు వైఎస్ జగన్ చేతుల మీదుగా వాటిని ప్రారంభించడానికి జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
పరిపాలన రాజధానిపై ప్రకటన..
వైఎస్ జగన్ తన విశాఖపట్నం పర్యటన సందర్భంగా పరిపాలన రాజధానిపై ఏదైనా ఓ సూచనప్రాయ ప్రకటన చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మూడు రాజధానుల తరలింపు వ్యవహారంలో ఇప్పటికే తీవ్ర జాప్యం ఏర్పడిందంటూ వైసీపీ నేతలు సైతం చెబుతున్నారు. దీనికి సరైన సమయం దొరకట్లేదనేది వారి వాదన. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత జాప్యం ఏర్పడుతుందని, అందుకే వీలైనంత త్వరగా విశాఖను పరిపాలన రాజధానిగా బదలాయించడమే మేలని చెబుతున్నారు.
Recommended Video
టీడీపీ అసహనానికి కారణ అదేనా?
మూడు రాజధానులను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ- ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలన రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడాన్ని తప్పు పడుతోంది. వైఎస్ జగన్ విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తుండటం వల్ల మూడు రాజధానులపై ఆయన ఏదైనా ప్రకటన చేస్తారని టీడీపీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ పార్టీ నాయకుల అసహనానికి ఇది ప్రధాన కారణం అయి ఉండొచ్చని చెబుతున్నారు.