ఏపీ ఎక్స్ప్రెస్ మరో ట్రాజెడీని మిగిలిస్తుందా? ఢిల్లీ దాకా వెళ్లాలంటే ప్రాణాలు ఉగ్గబట్టుకోవాల్సి
విశాఖపట్నం: రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ.. ఎండ దెబ్బ తగిలి, వడదెబ్బకు గురై అయిదుమంది ప్రయాణికులు కన్నుమూశారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం మధ్య నడిచే కేరళ ఎక్స్ప్రెస్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న ఉందంతం ఇంకా జనం మదిలో మెదలుతూనే ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తోన్న కేరళ ఎక్స్ప్రెస్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉందో తెలియజెప్పడానికి నిదర్శనం ఆ ఘటన. అలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావిచ్చేలా కనిపిస్తోంది మన ఏపీ ఎక్స్ప్రెస్ కూడా. విశాఖపట్నం-న్యూఢిల్లీ మధ్య నడుస్తోన్న ఏపీ ఎక్స్ప్రెస్లో కూడా నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపంలా మార్చేస్తున్నాయి.
ఢిల్లీ దాకా వెళ్లాలంటే.. ఉన్న రైలు ఇదొక్కటే!
ఉత్తరాంధ్ర నుంచి రైలులో ఢిల్లీ వెళ్లడానికి అందుబాటులో ఉన్న ఏకైక రైలు ఇదొక్కటే. నిర్వహణ లోపాలు ఈ రైలును వెంటాడుతున్నాయి. ప్రయాణికులను వేధింపులకు గురి చేస్తున్నాయి. సుమారు నెల రోజులుగా ఈ రైలులో ఏసీలు సరిగా పనిచేయట్లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం సుమారు రెండువేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ రైలులో సాంకేతిక లోపాలకూ కొరత లేదు. మొత్తం 16 బోగీలు ఉన్న ఈ రైలులో అన్నింట్లోనూ ఏదో ఒక సమస్య ప్రయాణికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోందనే ఫిర్యాదుల ఉన్నాయి.
వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..!
ఒక్కో బోగీలో 20 డిగ్రీల వరకు..
రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం.. ఏసీ టయర్ బోగీలో 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఏసీలు పనిచేయాల్సి ఉంటుంది. ఏపీ ఎక్స్ప్రెస్లో మాత్రం దీనికి భిన్నంగా ఉంటోంది. ఏసీ పనిచేయకపోవడం, ఏసీ బోగీలకు బయటి నుంచి గాలులు రాకుండా అద్దాలను బిగించేయడం వంటి చర్యల వల్ల ప్రయాణికులు ఉక్కపోతకు గురవుతున్నారు. కొంతలో కొంతవరకైనా బయటి నుంచి గాలి లోనికి రావడం వల్ల ఉక్కపోత ఉండదని, ఏబీ బోగీల్లో ఆ అవకాశమే లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో ఏసీలు మొరాయిస్తున్నాయి. ఏసీల్లోని మైక్రో ప్రాసెసర్లు పాతవి కావడం వల్లే సమస్య పునరావృతమవుతోంది.
ఎలుకలు వైర్లను కొరుకుతున్నాయట
ఏసీ మిషన్లు పనిచేయకపోవడానికి రైల్వే అధికారులు ఓ వింత కారణాన్ని చెబుతున్నారు. ఏసీ బోగీల్లో ఎలుకలు చొరబడుతున్నాయని, అవి వైర్లను కొరికి పడేస్తున్నాయని అంటున్నారు. వాస్తవ పరిస్థితి కూడా అదే. ఎలుకలను రాకుండా ఏం చేయాలి? ఏమీ చేయలేరు. అందుకే కనీసం ఏసీ యంత్రాల వైర్లకు రక్షణగా ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవట్లేదు. వాటిని అలా వదిలేస్తున్నారు. ఢిల్లీలో నిర్వహణ సమయంలో ఎలుకలు రైలులోకి ప్రవేశించి ఏసీలకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు కొరికేస్తున్నాయని, ఫలితంగా- ఏసీ సరఫరా నిలిచిపోతోందనేది అధికారుల వాదన. విశాఖలో రైలు నిర్వహణకు సరిపడా సిబ్బంది లేరని, 14 మంది అవసరం ఉన్నచోట.. నలుగురైదుగురితోనే నిర్వహణ పనులను లాగించేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.