విశాఖలో 75 కిలోమీటర్ల మెట్రో ఖరారు- నాలుగు కారిడార్లుగా- త్వరలో డీపీఆర్
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖలో అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో ఇప్పటికే వందల కోట్ల వ్యయంతో సుందరీకరణ, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పెండింగ్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టునూ పరుగులు పెట్టించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు పరిధిని 75 కిలోమీటర్లుగా నిర్ణయించిన ప్రభుత్వం నాలుగు కారిడార్లుగా దీన్ని అభివృద్ధి చేయబోతోంది. ఇందుకోసం సమగ్ర వివరాలతో డీపీఆర్ను త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
Recommended Video
విశాఖ మెట్రో పరిధి ఖరారు
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఏపీలోని ప్రస్తుతం మరే ఇతర నగరాల కంటే కూడా మెరుగైన స్ధితిలో ఉంది. ఇక్కడ కొత్తగా వస్తున్న ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు చెందిన ఉద్యోగులతో నగరం కిటకిటలాడుతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు ఎప్పటి నుంచో మెట్రోరైల్ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా అవి అరకొరగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు వాటిని దుమ్ముదులిపి ఎలాగైనా మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అడుగులు వేస్తోంది. కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే మెట్రో ప్రాజెక్టు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం 75 కిలోమీటర్ల మార్గంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు తుది ఆమోద ముద్ర వేసింది.
నాలుగు కారిడార్లుగా విభజన...
విశాఖలో ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 75 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టును నాలుగు కారిడార్లుగా విభజించారు. స్టీల్ ప్లాంట్ గేటు నుంచి కొమ్మాడి జంక్షన్ వరకూ, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ, కొమ్మాడి జంక్షన్ నుంచి భోగాపురం వరకూ నాలుగు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నాలుగు కారిడార్ల ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్ సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని విజయవాడలో నిర్వహించిన సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆధేశించారు. వచ్చే ఏడాది కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నాటికి మెట్రో పనులను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
2025 నాటికి రోజుకు ఆరులక్షల మంది ప్రయాణం...
కోవిడ్ కారణంగా డీపీఆర్ తయారీ ఆలస్యమైనప్పటికీ సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రభుత్వానికి అందించేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఆ తర్వాత దాన్ని వెంటనే ఆమోదించి ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో డీపీఆర్ పూర్తి చేసి ప్రాజెక్టు మొదలుపెడితే మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ లెక్కన చూస్తే 2025 నుంచి రోజుకు సగటున ఆరు లక్షల మంది విశాఖ మెట్రోలో ప్రయాణించేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక మెట్రోగా ఉన్న హైదరాబాద్ మెట్రోరైల్ కంటే మెరుగైన టెక్నాలజీతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.