విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎన్నో రోజులుగా విశాఖకుమెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు నాలుగడుగులు ముందుకు పదడుగులు వెనక్కు అన్నట్టుగా సాగాయి. గతంలో విశాఖ మెట్రో గురించి కొన్ని చర్చలు జరిగాయి. చర్చలు జరిగాయి కానీ, అడుగు మాత్రం ముందుకు పడలేదు. అయితే, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మెట్రోపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖ వాసులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన సమీక్ష సమావేశంలో విశాఖ మెట్రో గురించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.
విశాఖలో 10 విడతల్లో 10 కారిడార్లలో మొత్తం 140.13 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్ పేస్ లో మొత్తం 4640 కిలోమీటర్లు, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.26 కిలోమీటర్లు నిర్మించనున్నారు. అంతేకాకుండా తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేయబోతున్నారు. 2020 నుంచి 2024 మధ్య దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇప్పటికే వివిధ రకాల డిజైన్లను పరిశీలించారు.
విశాఖ మెట్రో నిర్మాణం మంచి నిర్మాణశైలితో జరగాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, అత్యుత్తమ విధానాలతో అద్భుతంగా నిర్మాణం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మెట్రోలో రైలు కోచ్ ల నుండి స్టేషన్ల నిర్మాణం వరకు అద్భుతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సీఎం జగన్మోహన్ రెడ్డి మెట్రో రైలు నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయంతో విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.