విశాఖ మెట్రో రైలుకు కొత్త డీపీఆర్: ఏపీ సర్కారు ఆదేశాలు
అమరావతి: విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్ ఎండీని ఆదేశించింది. గతంలో డీపీఆర్ రూపలకల్పనకు ఎస్సెల్ ఇన్ఫ్రా కన్సార్టియంకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ఏపీ సర్కారు.. కొత్త డీపీఆర్కు ప్రతిపాదనలు ఆహ్వానించింది.
విశాఖలో 79.9కి.మీ పరిధిలో మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్కు ప్రభుత్వం కార్యాచారణ రూపొందించనుంది. కాగా, ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
విశాఖపట్నంలో మొత్తం 79.9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న ఏపీ సర్కారు.. మూడు కారిడార్లలో మెట్రో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. మెట్రోతోపాటు మరో 60 కి.మీ మోడ్రన్ ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఇప్పటికే విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై విశాఖవాసులు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రోతో విశాఖ మరింత అందం, ఆకర్షణ వస్తుందని అభిప్రాయపడుతున్నారు.