విశాఖపై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రాజధాని ప్రకటనకు ముందే అధికారులకు కీలక ఆదేశాలు..
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగుతున్న వేళ.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయకముందే.. దానిపై ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదిక కూడా సిద్ధం చేయకమునుపే.. విశాఖపట్నానికి సంబధించి సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా తొలిసారి జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్ని విశాఖలో నిర్వహించాలని ఆయన డిసైడయ్యారు.
విజయవాడ నుంచి విశాఖకు బదిలీ
2014లో రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య వేడుకలు, రిపబ్లిక్ డే ఉత్సవాలు విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలోనే జరుగుతున్నాయి. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే ఊహాగానాల నడుమ ఈ ఏడాది రిపబ్లిక్ డేను విశాఖలోనే నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకోవడం రాజకీయాంగానూ చర్చనీయాంశమైంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జనవరి 26న విశాఖపట్నంలోనే జెండా ఎగరేసి, రిపబ్లిక్ డే స్పీచ్ ను అందిస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే గవర్నర్ విశాఖలో కచ్చితంగా ఎక్కడ జెండా ఎగరేస్తారనేది తెలియాల్సిఉంది.
వైజాగ్ పై సీఎం వరుస ప్రశ్నలు..
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం మున్సిపల్ శాఖపై రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలోని పురపాలికలు, కార్పొరేషన్ల స్థితిగతులపై సమగ్ర రిపోర్టుతో అధికారులు హాజరుకాగా.. సీఎం మాత్రం ఎక్కువగా విశాఖపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. విశాఖపట్నంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నెలకొన్న సమస్యలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ సారి రిపబ్లిక్ డే విశాఖలోనే నిర్వహించబోతున్నట్లు ఆ మీటింగ్ లోనే సీఎం వెల్లడించారు.
వడివడిగా అడుగులు..
మూడు రాజధానుల అంశంపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ తరలింపునకే ప్రాధాన్యం ఇచ్చినా.. టెక్నికల్ సమస్యల కారణంగా ప్రభుత్వం అధికారిక ప్రటకన మాత్రం చేయలేదు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీర్మానం ద్వారానే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఆలోపే ప్రజల్ని అన్ని రకాలుగా సిద్దం చేయాలన్న ఉద్దేశంతోనే రిపబ్లిక్ డే వేడుకల్ని విశాఖలో నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.