డాక్టర్ సుధాకర్ కేసులో ట్విస్టులు- యూటర్న్ ఒప్పుకోని హైకోర్టు- సీబీఐతో మరో దర్యాప్తు
విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కరోనా విధుల్లో ఉన్న తమకు ప్రభుత్వం మాస్కులు, గ్లోవ్లు ఇవ్వడం లేదని సుధాకర్ చేసిన ఆరోపణలు, అనంతరం ఆయన రోడ్డుపై వెళ్తుండగా పోలీసులు నిర్బంధించి స్టేషన్కు తీసుకెళ్లడం, అనంతర పరిణామాల్లో పిచ్చాసుపత్రికి తరలించడం, దీనిపై టీడీపీ, వైసీపీ విమర్శల యుద్ధం, చివరికి తన మానసిక స్ధితి బాగోలేక అలా వ్యవహరించినట్లు సుధాకర్ చెప్పడం చకచగా జరిగిపోయాయి. ఈ మధ్యలో టీడీపీ నేత వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు సీబీఐ ఇచ్చిన రిపోర్టును హైకోర్టు తిరస్కరించడం సంచలనంగా మారింది.
సంచలనాల డాక్టర్ సుధాకర్
రాష్ట్రమంతా కరోనా ప్రభావంతో బిక్కిబిక్కుమంటున్న పరిస్ధితుల్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ విధుల్లో బిజీగా ఉన్నారు. అప్పటికి రాష్ట్రంలో రోగులకు చికిత్సనందిస్తున్న వీరికి తగినంత స్ధాయిలో మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవు. దీంతో విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో విధుల్లో ఉన్న మత్తుమందు డాక్టర్ సుధాకర్.. భద్రతా సామాగ్రి ఇవ్వకుండా వైద్యం ఎలా చేయాలని బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాక డాక్టర్ సుధాకర్ అంతా ఒట్టిదేనంటూ యూటర్న్ తీసుకున్నారు.
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి సీబీఐ
ప్రభుత్వంపై కరోనా సామాగ్రి విషయంలో విమర్శలు చేసిన కొన్ని రోజులకే విశాఖలో రోడ్డుపై వెళ్తున్న సుధాకర్ కారును పోలీసులు ఆపారు. ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో సుధాకర్ సహకరించపోవడంతో చేయి చేసుకున్నారు. చివరికి అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన మానసిక పరిస్ధితి బాగోలేదని పిచ్చాసుపత్రికి తరలించారు. అక్కడ తన కుమారుడికి పిచ్చి పెరిగే మందులిస్తున్నారని సుధాకర్ తల్లి ఆరోపించారు. దీంతో ప్రభుత్వం తమపై విమర్శలు చేసిన సుధాకర్ను టార్గెట్ చేసిందని అర్ధమైంది. దీనిపై టీడీపీ నేత వంగలపూడి వనిత హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది.
సుధాకర్ యూటర్న్తో సీబీఐకి చుక్కలు
సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ప్రాథమిక విచారణలో జరిగింది చెప్పిన సుధాకర్ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వం తనను టార్గెట్ చేయలేదని, అంతా ఒట్టిదేనని, తానో ప్రభుత్వ ఉద్యోగినని, సీఎం జగన్ సహా ఎవరిపైనా తనకు కోపం లేదని చెప్పేశారు. దీంతో అప్పటివరకూ సుధాకర్తో పాటు ఆయన తల్లి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. అప్పటివరకూ కేసు బలంగా ఉందని భావించిన సీబీఐకి సుధాకర్ యూటర్న్ ఇబ్బందికరంగా మారింది. బాధితుడే యూటర్న్ తీసుకున్నాక తాము చేసేదేముందంటూ సీబీఐ కూడా హైకోర్టుకు మొక్కుబడి నివేదిక సమర్పించి చేతులు దులుపుకోవాలని భావించింది.
Recommended Video
సీబీఐ నివేదిక తిరస్కరణ- మరో దర్యాప్తు
డాక్టర్ సుధాకర్ కేసులో తాము చేసిన దర్యాప్తు నివేదికను సీబీఐ సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. అయితే ఈ నివేదికలో ఏముందో వెల్లడికాకపోయినా, బాధితుడి యూటర్న్, ఇతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ఇందులో దర్యాప్తు చేయాల్సింది ఏమీ లేదని సీబీఐ తేల్చినట్లు తెలుస్తోంది. కానీ డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యలు, తర్వాత పరిణామాలపై వీడియో సాక్ష్యాలు ఉన్నప్పుడు, బాధితుడు యూటర్న్ తీసుకున్నంత మాత్రాన కేసు క్లోజ్ చేయాలా అని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అదనపు డైరక్టర్ స్ధాయి అధికారితో మళ్లీ దర్యాప్తు చేయించాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మార్చి 31 వరకూ గడువిచ్చింది.