విశాఖకు కార్యాలయాల తరలింపుపై నేడు కీలక విచారణ... హైకోర్టు నిర్ణయంపై ఆసక్తి...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే గవర్నర్ ఆమోదం పొందిన రాజధాని బిల్లులపై స్టేటస్కో విధిస్తూ ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు చట్టపరమైన ఆమోదం లభించిన నేపథ్యంలో కొత్త రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేపట్టే విషయంలో హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి ఆటంకంగా మారాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారం రాష్ట్రం పరిధిలోనిదే అంటూ అఫిడవిట్లు దాఖలు చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఏర్పాటు చేసిన మూడు రాజధానులపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అలా కాకుండా ప్రతికూలంగా వస్తే మాత్రం ప్రభుత్వం మరికొంత సమయం వేచి చూడక తప్పదు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గవర్నర్ కూడా రాజధానులకు ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది.
అమరావతి రాజధానిపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు, రైతులకు జరగాల్సిన న్యాయం వంటి అంశాలు ఇందులో కీలకంగా కనిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ వస్తై హైకోర్టుకూ అభ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే రాజధాని విశాఖకు వెళ్లినా అమరావతిలో చేపట్టబోయే ప్రాజెక్టులు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నిర్మాణాలపై సీఆర్డీయే ఇచ్చిన నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు అందజేయబోతోంది. హైకోర్టు తుది తీర్పులో ఇది కీలకంగా మారనుందని భావిస్తున్నారు.