పాలనా రాజధానిగా విశాఖలో తొలి వేడుక అదే?: ప్రభుత్వ కార్యకలాపాల ఆరంభానికి శ్రీకారం
విశాఖపట్నం: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మారిన సాగర నగరం విశాఖపట్నం.. తొలి వేడుకను జరుపుకోబోతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రం రామకృష్ణా బీచ్ దీనికి వేదిక కాబోతోంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేయనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి తుది ఆదేశాలు రేపో, మాపో వెలువడనున్నాయి. ఈ ఆదేశాలు అందిన వెంటనే జిల్లా అధికారులు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటుంది.
ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. ఇందులో భాగంగా పంద్రాగస్టు వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించడానికి ప్రభుత్వం పాలనాపరమైన చర్యలను తీసుకుంటోంది. తొలుత- అక్కడ అనుకూల పరిస్థితులను పరిశీలించిన తరువాత.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేస్తారు. రామకృష్ణా బీచ్లో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.
అమరావతి కోసం టీడీపీ ఆఖరి అస్త్రం ? మూకుమ్మడి రాజీనామాల ప్రచారం- అదేం లేదంటున్న పార్టీ..
ఈ వేడుకలను నిర్వహించడానికి రామకృష్ణా బీచ్లో అనువైన వాతావరణం ఉందా? లేదా? అనే విషయంపై ఆరా తీయాలని కలెక్టర్ వినయ్ చంద్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. కారు పార్కింగ్, గ్యాలరీ, రవాణా వంటి వసతులు ఉన్నాయా? లేవా అనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా వైరస్ వల్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ జెండా వందన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున.. పరిమితంగానే ఆహ్వాన పత్రాలను పంపిస్తారని, ఆహ్వానితుల సంఖ్య 50కి మించకపోవచ్చని చెబుతున్నారు.
Recommended Video
నిజానికి- గత ఏడాదే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించడానికి ప్రభుత్వం భావించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలోనే నిర్వహించారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ సారి అధికారికంగా సాగర నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతున్నట్లు సమాచారం.