గంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనం
ఆంధ్రప్రదేశ్ కొత్త కార్యానిర్వాహక రాజధాని విశాఖపట్నానికి సంబంధించిన రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అధికార వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నవేళ.. ఆయన రాకను వ్యతిరేకిస్తూ అదే జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటాపై అవంతి చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీనివాసరావుకు చేరికకు సీఎం జగన్ ఆమోదించారా? నో చెప్పారా? అనే డిబేట్ ఊపందుకుంది.
సీఎం జగన్ మరో రెండు కీలక నిర్ణయాలు - ఏపీ వ్యాప్తంగా ఆ కమిటీలు రద్దు - నకిలీలపై ఇంటెలిజెన్స్ నిఘా..
16న చేరబోతున్నారంటూ..
కొన్నాళ్లుగా సొంత పార్టీ టీడీపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోన్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 9న ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగినా, చేరిక ముహుర్తం ఈనెల 16కు ఖరారైందని, ఆ రోజు గంటా తన కీలక అనుచరులతో కలిసి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తారని మంగళవారం వార్తలు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలైన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం తరహాలోనే గంటా శ్రీనివాస్ కూడా నేరుగా వైసీపీ కండువా కప్పుకోకుండా, తన అనుచరులను మాత్రం చేర్పించి, సీఎంకు మద్దతు పలుకుతారని తెలుస్తోంది.
దొడ్డిదారిలో వైసీపీలోకి..
ఆగస్టు 16న సీఎం జగన్ సమక్షంలో గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరబోతున్నారన్న సమాచారాన్ని లీకేజీ వార్తలుగా, గంటా ఉద్దేశపూర్వకంగా సాగించుకుంటోన్న తప్పుడు ప్రచారంగా మంత్రి అవంతి శ్రీనివాస్ అభివర్ణించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొడ్డిదారిలో వైసీపీలో చేరేందుకు గంటా విశ్వప్రయత్నం చేస్తున్నారని, అధికారం ఎక్కడుంటే గంటా అక్కడ వాలిపోతారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నేర చరిత్రను సైతం ఆయన గుర్తుచేశారు. అవంతి, గంటాలు గతంలో టీడీపీలో సహచరులేనన్న సంగతి తెలిసిందే.
కేసుల భయంతోనే చేరిక..
‘‘విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నామనో, వైసీపీ విధానాలు నచ్చడం వల్లనో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరాలనుకోవడం లేదు. కేవలం తాను చేసిన అరాచకాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే దొడ్డి దారిలో మా పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముహూర్తాల లీకులు ఇస్తున్నారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా.. భూ కుంభకోణాలు, సైకిళ్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. అప్పటి సహచర మంత్రి అయ్యన్నపాత్రుడే గంటాపై ఫిర్యాదు కూడా చేశారు'' అని మంత్రి అవంతి తెలిపారు.
చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్
సాయిరెడ్డికి అన్నీ చెప్పాను..
గంటా శ్రీనివాసరావు అక్రమాలు, కుంభకోణాలపై ఇప్పటికే సిట్ విచారణ కూడా జరిగిందని, అవినీతి పరుల చేరికతో పార్టీకి నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డికి ఇదివరకే తెలియజేశానని మంత్రి అవంతి పేర్కొన్నారు. ‘‘అలాగైతే, మరి గంటా రాకకు సీఎం జగన్ నో చెప్పారా?''అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘పార్టీలోకి గంటాను చేర్చుకునేది, లేనిది అధిష్టానం చూసుకుంటుంది''అంటూ అవంతి తెలివిగా తప్పించుకున్నారు.
Recommended Video
గంటా చేరికతో వైసీపీకి లాభమేంటి?
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ, అర్బన్ ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీకి వైజాగ్ సిటీ, శివారు ప్రాంతాల్లో మాత్రం ఎదురుదెబ్బ తప్పలేదు. అక్కడి నాలుగు స్థానాలను.. విశాఖ నార్త్(గంటా), విశాఖ వెస్ట్(గణబాబు), విశాఖ సౌత్(వాసుపల్లి గణేశ్), విశాఖ ఈస్ట్(వెలగపూడి రామకృష్ణ) టీడీపీ గెల్చుకుంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో.. వైసీపీతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానిస్తే మంచిదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారని, అందులో భాగంగానే గంటా చేరికకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరిగింది. గంటా చేరిక ద్వారా సిటీ రాజకీయాలపై పూర్తిగా పట్టు సాధించడంతోపాటు త్వరలో జరుగనున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కలిసొస్తుందని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపో, మాపో ఈ ప్రక్రియ ముందుకు వెళుతుందనగా మంత్రి అవంతి శ్రీనివాస్ అనూహ్య వ్యాఖ్యలతో విరుచుకుపడటం గమనార్హం.