చంద్రబాబు డ్రామాలు అందరికీ తెలుసు, విజయనగరం వెనకబాటుకు ఆయనే కారణం: బొత్స
విజయనగరం అభివృద్ధి చెందకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా మార్చి. తర్వాత ఒక్కో జీవోతో రద్దు చేసిందని గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. గ్రామాల నుంచి వలసలు పెరగడంతో పట్టణ జనాభా పెరుగుతుందని.. దానికి తగినట్టు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
విజయనగరం జిల్లా నుంచి మూడు దశాబ్ధాల పాటు ఎమ్మెల్యే అయిన ఓ వ్యక్తి అభివృద్ధిపై దృష్టిసారించలేదని బొత్స విమర్శించారు. అందుకే విజయనగరం జిల్లా ఏర్పడి 40 ఏళ్లు అవుతున్న,, అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందని బొత్స తెలిపారు. అయితే అత్యవసర పనులను మాత్రమే త్వరగా చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ముందు అత్యవసర పనులకు ప్రయారిటీ ఇస్తామని తెలిపారు.
విజయనగరంలో 24 గంటల నీటి సరఫరాకు కృషి చేస్తున్నామని తెలిపారు. వర్షం వల్ల రహదారులపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇసుక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని బొత్స తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో రాతల గురించి ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న కామెంట్లు సరికాదని గుర్తుచేశారు. అందరి ఇళ్లలో మహిళలు ఉంటారని వారిని కించపరుస్తూ ఎవరూ మాట్లాడబోరని చెప్పారు. కానీ కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు ఆడటం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీడీపీ చేసే డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని బొత్స స్పష్టంచేశారు.