తెలంగాణలో వ్యాపారం- ఏపీలో రాజకీయం: ఒకే సినిమాకు రెండు టైటిళ్లు..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు లోక్సభ సభ్యుడు, అమరరాజా బ్యాటరీస్ అధినేత గల్లా జయదేవ్.. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు సంధించారు. ఈ విషయంలో తెలుగుదేశం చేస్తోన్న విమర్శలపై ఆయన ఎదురుదాడికి దిగారు. టీడీపీకి అనుకూలంగా ఉంటోన్నట్లు చెబుతున్న మీడియాలో వస్తోన్న కథనాలపైనా మండిపడ్డారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టట్లేదా?
ఏపీ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ టీడీపీ అసత్యాలను ప్రచారం చేస్తోందంటూ గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వ్యాపార విస్తరణలో భాగంగా పారిశ్రామికవేత్తలు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని గుర్తు చేశారు. వేరే ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన సొంత రాష్ట్రం నుంచి వెళ్లిపోయినట్టు కాదని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టట్లేదా? అని నిలదీశారు.
పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేయకూడదని చట్టం ఉందా?
అమరరాజా గ్రూప్ ఏపీలో మాత్రమే వ్యాపార కార్యకలాపాలు, యూనిట్లను నెలకొల్పాలంటూ చట్టం ఏమైనా అమలులో ఉందా అని ప్రశ్నించారు. గల్లా జయదేవ్కు అమరరాజా కంపెనీ తమ ప్రభుత్వ వైఖరి వల్లే 9,500 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టుగా టీడీపీ చేస్తోన్న ప్రచారంలో అర్థం లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అమరరాజా కంపెనీకి చెందిన ప్రతినిధులు ఏ ఒక్కరైనా గానీ.. ఏపీ ప్రభుత్వ వైఖరి నచ్చకపోవడం వల్లే తాము తెలంగాణకు వెళ్లిపోతున్నామంటూ చెప్పారా? అని ప్రశ్నించారు.
ఒకే కథనంతో..
తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీకి చెందిన అనుకూల మీడియా కథనాలు వండి వడ్డిస్తోందని విమర్శించారు. ఒకే కథనంతో ఆ రెండు దినపత్రికలు తప్పుడు ప్రచారం చేశాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఒకే సినిమాకు రెండు టైటిళ్లు పెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. తాము కక్షసాధింపు చర్యలకు పాల్పడితే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిశ్రమలు ఎలా నడుస్తున్నాయని, కొత్తవి ఎలా వస్తోన్నాయో సమాధానం చెప్పగలరా అంటూ ఆయన నిలదీశారు.
హెరిటేజ్ వెళ్లిపోయిందా?
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటెజ్ వ్యాపారం కూడా హైదరాబాద్లోనే ఉందని మంత్రి గుర్తు చేశారు. హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ.. ఆ కంపెనీ ఏపీలో కూడా కార్యకలాపాలను సాగిస్తోందని, చెప్పారు. తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఇక్కడ చంద్రబాబు వ్యాపారం ఎలా సాగుతుందని అన్నారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేసే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.
చెడ్డపేరు తీసుకుని రావడానికే..
ప్రభుత్వంపై ప్రతిరోజూ ఏదో రకంగా బురద చల్లాలనే ప్రయత్నాలు చేయడం తప్ప మరో ఆలోచన చంద్రబాబుకు గానీ, టీడీపీకి గానీ లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకుని రావాలనే ఉద్దేశంతో తప్పుడు వార్తలను తన అనుకూల మీడియాతో నిత్యం రాయిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తోంటే వెళ్లిపోతున్నాయంటూ ప్రచారం చేయడం ఎలాంటి రాజకీయమని ప్రశ్నించారు.