25న టీడీపీ ఎమ్మెల్యే గంటా ఆస్తుల వేలం- ఇండియన్ బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంలో..
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్న బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు హైదరాబాద్ బ్రాంచ్ ఈ నెల 25న ఆయనతో పాటూ గ్రూప్ డైరెక్టర్ల ఆస్తుల వేలానికి నోటీసులు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేత వ్యవహారాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు రుణ ఎగవేత దారుల ఆస్తుల వేలానికి సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గతంలో డైరెక్టర్గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఇండియన్ బ్యాంక్ ఎస్ఏఎమ్ బ్రాంచ్ నుంచి రూ.141.68 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడంతో 2016 అక్టోబర్లోనే డిమాండ్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా రుణం తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి అది రూ.248.03 కోట్లకు చేరింది. దీంతో ఇండియన్ బ్యాంకు చర్యలకు దిగింది.
బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో గతంలో డైరెక్టర్లుగా వ్యవహరించిన గంటా శ్రీనివాస్తో పాటు ఇతరులకూ ఇండియన్ బ్యాంకు వేలం నోటీసులు జారీ చేసింది. వీరిలో గంటాతో పాటు పీవీ భాస్కరరావు, కేబీ సుబ్రహ్మణ్యం, నార్ని అమూల్య, పరుచూరి భాస్కరరావు ఉన్నారు. వీరి ఆస్తులను ఈ నెల 25న వేలం వేసేందుకు వీలుగా ఈ నోటీసులు ఇచ్చింది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో 2016 డిసెంబర్ 27, 2017 ఫిబ్రవరి 21న పలు ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ ఆస్తుల అమ్మకానికి జారీ చేసిన ఈ టెండర్ ఈ నెల 23 సాయంత్రం ఐదు గంటలకు పూర్తి కానుంది. అనంతరం ఈ నెల 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఆస్తుల ఈ-వేలం నిర్వహిస్తారు.
Recommended Video
ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్, ప్రత్యూష ఎస్టేట్స్కు చెందిన ఆస్తులను వేలం కోసం అటాచ్ చేశారు. విశాఖపట్నం పాత నగరంలోని ఆఫీసు కాంప్లెక్స్తో పాటు గాజువాక, చినగడలి, రుషికొండ, మధురవాడ, ఆనందాపురం, బాలయ్య శాస్త్రి లే అవుట్, తూర్పుగోదావరిలోని అనకాపల్లి, కాకినాడ, తమిళనాడులో ఈ గ్రూప్ ఆస్తులు ఉన్నాయి. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పోరేషన్ (ఎంఎస్టీసీ) ఈ వేలం నిర్వహించబోతోంది. ఈ వ్యవహారంపై గతంలో స్పందించిన గంటా శ్రీనివాస్ తాను ప్రత్యూష గ్రూప్ నుంచి ఎప్పుడో తప్పుకున్నానని, ఈ వేలంలో తనకు చెందిన ఓ ఆస్తి మాత్రమే ఉందని తెలిపారు.