టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
ఒకపక్క తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే కేంద్ర మంత్రులకు సైతం ఆహ్వానాలు పంపి అట్టహాసంగా వేడుకలకు సంబంధించిన పనులలో బిజీగా ఉంది. ఇక ఇదే సమయంలో టిటిడి బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ నియమించారని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారం రేపాయి.
టీటీడీ బోర్డు సభ్యులపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు టిటిడి బోర్డులో సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను సభ్యులుగా నియమించారని ఆరోపణలు గుప్పించారు . ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక గతంలో టిడిపి పాలన సమయంలో చేసిన విమర్శలను గుర్తు చేశారు. టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా శేఖర్ రెడ్డి నియామకంపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గవర్నర్ హరి చందన్ ను కలిసిన బీజేపీ నేతల బృందం .. వైసీపీ అప్రజాస్వామిక విధానాలపై ఫిర్యాదు
ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డి దగ్గర ఎంత తీసుకున్నారో చెప్పండి అన్న అచ్చెన్న
గతంలో విజయ సాయి రెడ్డి, అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి శేఖర్రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్గా నియమించారని , శేఖర్ రెడ్డి అవినీతిపరుడని ఆరోపణలు గుప్పించారు అని గుర్తు చేశారు . ఇక ఇప్పుడు ఆయన సచ్చీలుడు అంటూ కితాబిస్తూ ఆయనకు ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇవ్వడానికి మీ ప్రభుత్వం ఎన్ని కోట్లు తీసుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా కాపాడిందని పేర్కొన్నారు.
పచ్చ డైమండ్ కనపడలేదన్న జేఈవో వ్యాఖ్యలపై అచ్చెన్న ఫైర్
అచ్చెన్నాయుడు పచ్చ డైమండ్ తిరుమలలో లేదని జేఈవో ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలన్న ఆయన ఆ డైమండ్ గురించి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారిపై సుమోటాగా కేసు నమోదు చేయాలని కోరారు.టీటీడీ చైర్మన్ నియామకం నుండి టిటిడి బోర్డు మెంబర్ల ప్రమాణస్వీకారం వరకు అన్నింటిపైనా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో అధికార పార్టీ అధినేత జగన్ తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు భక్తులకు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలన్నారు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.
నిరాధారంగా ఆరోపిస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
తిరుమల తిరుపతి విషయంలో గత ప్రభుత్వం మీద అభాండాలు వేస్తే, నిరాధారమైన ఆరోపణలు చేస్తే రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారుగట్టిగా మాట్లాడిన వారి మీద కేసులు నమోదు చేస్తున్నారని, జగన్ను విమర్శించినందుకు అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేశారన్నారు.
ప్రభుత్వ పాలనపై అచ్చెన్న విసుర్లు
గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో వైసిపి నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినా టిడిపి ఎన్నడూ కేసులు పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. . పీపీఏల రద్దు వల్ల గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. బోటు ప్రమాద బాధితులను ఇప్పటివరకు పరామర్శించిన జగన్ తీరుపై ఆయన మండిపడ్డారు. మొత్తానికి టిటిడి బోర్డు సభ్యుల విషయంలో క్రిమినల్స్ కు అవకాశం ఇచ్చారంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై టిటిడి బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.