పిచ్చోడు జగన్ కంటే బాగా పాలిస్తాడు: దొంగలు రాజ్యం చేస్తున్నారు: అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు..!
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ మీద..పోలీసు శాఖ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. విశాఖలోని పిచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందే పిచ్చివాడు జగన్ కంటే బాగా పాలిస్తాడంటూ వ్యాఖ్యానించారు. దొంగలు రాజ్యం చేస్తుంటే.. రక్షించాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇవీఎంలతోనో..ఓట్లతోనే గెలిచిన జగన్ సీఎం సీట్లో కూర్చున్న తరువాత కూడా పద్దతి మార్చుకోలేదంటూ మండి పడ్డారు. అవగాహన లేక..అహంకారిత పూరితంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అయ్యన్న ఫైర్ అయ్యారు.
తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను.. ప్రభుత్వాలను చూసాను కానీ..ఇటువంటి పాలన ఏనాడు చూడలేదని..ఇదసలు ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్న ప్రభుత్వమేనా అని ప్రశ్నించారు. వైసీపీకి ప్రజలు మద్దతిచ్చి గెలిస్తే ఏపీనీ అధోగతి పాలు చేసారంటూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ సభ ఏర్పాటు చేస్తే అర్దరాత్రి వరకు వేదిక ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి వద్దని చెప్పారంటూ వేదిక పనులను అడ్డుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా జనసేన భవిష్యత్ లో ఏ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేసారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పదే పదే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్త పుత్రుడు అని విమర్శించటాన్ని తప్పు బట్టారు. జైలు శిక్ష అనుభవించి అక్రమాలు చేసిన విజయ సాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు అయినంత మాత్రాన ఇ్టాను సారం మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదని.. 50 వేలు ఇస్తే మాత్రం దొరుకుతుందని విమర్శించారు.
ఇది శాడిస్ట్ ప్రభుత్వం...
ఏపీలో శాడిస్ట్ ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో 151 సీట్లు అప్పగిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారని విమర్శించారు. వారికి రాష్ల్రం రాసిచ్చినట్లుగా భావిస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధినేతకు ఫోన్ చేసి మద్దతు కోరగానే..ప్రజాసమస్యల పైన మరో ఆలోచన లేకుండా చంద్రబాబు అంగీకరించారని చెప్పుకొచ్చారు.
భవిష్యత్ లోనూ ప్రజా సమస్యల పైన ఇదే రకంగా టీడీపీ ఎవరికైనా మద్దతిస్తుందని స్పష్టం చేసారు. ఏపీలో ఇసుక దొరకటం లేదని..కానీ, 50 వేలు ఇస్తే హైదరాబాద్ తో సహా ఏ ప్రాంతానికి అయినా ఇసుక సిద్దం చేస్తారని విమర్శించారు. ఇసుక సమస్య పరిష్కారం అయ్యే వరకూ టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని..పోరాటాలు చేసే వారికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేసారు.