ఏపీ మంత్రి జయరాం కుమారుడికి బెంజి కారు: అదీ గిప్ట్ కాదు లంచం, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు మంత్రి కుమారుడికి కాస్ట్లీ కారు కొనిచ్చారని ఆరోపణలు చేశారు. శుక్రవారం విశాఖపట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కుమారుడు ఈశ్వర్కు.. తెలకపల్లి కార్తీక్ కారు అందజేసిన ఫోటోలను మీడియాకు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్పై ఫిర్యాదు చేశారు.
జయరాంకు బినామీ.. అందుకోసమే...
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన ఏ-14 నిందితుడు కార్తీక్ అని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈశ్వర్ బర్త్ డే రోజున బెంచ్ కారు ఇచ్చారని, దానికి సంబంధించిన ఫోటోలను చూపారు. కారును ఎందుకు గిప్ట్గా ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ-14 కార్తీక్.. మంత్రి జయరాంకు బినామీ అని ఆరోపించారు. అందుకోసమే పుట్టినరోజు సాకు చూపి.. మంత్రికి లంచం ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది మాజీ మంత్రి అచ్చెన్నాయడు కాదని.. మంత్రి జయరాం అని ఆరోపించారు.
మెడికల్ ఏజెన్సీ నడుపుతూ..
కార్తీక్ విజయవాడ విజయవాడ భవానీపురంలో తిరుమల మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారని తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టయి.. బెయిల్పై విడుదలయ్యారని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. మంత్రి కుమారుడికి ఇచ్చిన కారు, ఇద్దరి ఫోటోలను మీడియాకు చూపించారు. మంత్రి కుమారుడికి ఇచ్చిన కారు లంచం అన్నారు. మంత్రి కుమారుడికి కారు ఇవ్వాల్సిన అవసరం ఏంటి.. ఈఎస్ఐ స్కాంలో వారి ప్రమేయం ఉందని నిరూపిస్తామని తెలిపారు.
ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
మంత్రి జయరాంను తప్పించేందుకు కేసును పక్కదారి పట్టించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆధారాలు ఇస్తున్నాంమని, జయరాంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ కమిటీ వేసినా.. ఆధారాలు సమర్పించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
ఏసీబీ కాల్ సెంటర్కు ఫోన్
అయ్యన్నపాత్రుడు మీడియా ముందే ఏసీబీ కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో అవినీతి జరిగిందని.. కుంభకోణంలో కార్మికశాఖ మంత్రి జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ ప్రమేయం ఉందని చెప్పారు. మంత్రి జయరాం అవినీతికి సంబంధించి ఇవిగో ఆధారాలు అని పేర్కొన్నారు. కారు గిప్ట్ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్మికశాఖ మంత్రి జయరాంపై దర్యాప్తు జరిపించాలని కోరారు. నిజంగా సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలని స్పష్టంచేశారు. అలాగే బీసీ నేతలపై ఊరికే ఆరోపణలు చేయడం సరికాదన్నారు.