ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ: కాపులపాడులో పరిపాలనా రాజధాని..భీమిలికి మహర్దశ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సూచనప్రాయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో చేసిన ప్రకటన, ఆపై నిపుణుల కమిటీ నివేదిక ఏపీ రాజధాని ముక్కలు కాబోతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఇక దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.
భీమిలిలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం అన్న విజయసాయి
ప్రస్తుతం వున్న అమరావతిని లిజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామని చెప్పిన సీఎం జగన్ ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అయితే విశాఖలోని భీమిలి లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం కానుందని విజయసాయి పేర్కొన్నారు. తగరపువలసలో జరిగిన సభలో విజయసాయి ఈ విషయాన్ని స్పష్టంచేశారు. పాలకుల పట్టింపు లేనితనంతో వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ది కోసమే భీమిలిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం అని విజయసాయి పేర్కొన్నారు.
కాపులపాడులో పరిపాలనా రాజధాని అన్న విజయసాయి
విజయసాయి ప్రకటనతో భీమిలికి మహర్దశ పట్టబోతుంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భీమిలి నియోజకవర్గానికి రాజధాని రావడం నిజంగా సంతోషకరమని, రాజధానిపై విధి విధానాలు జగన్ ప్రకటిస్తారని కూడా విజయసాయి రెడ్డి తెలిపారు.కాపులపాడులో పరిపాలనా రాజధాని నిర్మాణం చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు భీమిలిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భీమిలిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే భీమిలి మహా నగరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
భీమిలి రాజధాని ఆలోచనపై స్థానికుల హర్షం
ప్రస్తుతం భీమిలిలోని ప్రభుత్వ భూములపై సర్వే జరుగుతుందని ఆయన వివరించారు. అయితే సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భీమిలిని రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా చూసే అవకాశం ఉందని వైయస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించిన తరువాత, స్థానికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు .
భీమిలి పరిసర ప్రాంతాల్లో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న కలెక్టర్
భీమిలి పరిసర ప్రాంతాలలో 4000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. నగరానికి ఆనుకుని ఉన్న విశాఖ గ్రామీణ, విశాఖ అర్బన్ , ఆనందపురం , భీమిలి ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది అని జిల్లా కలెక్టర్ తెలిపారు. భీమిలి రాజధాని అని వైసీపీ నేత విజయ సాయి చేసిన ప్రకటనపై భీమిలి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపధ్యం ఉన్న భీమిలి అభివృద్ధికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రాజధాని ఏర్పాటు జరిగితే భీమిలి రూపు రేఖలు మారిపోతాయని చెప్తున్నారు. ఏది ఏమైనా విశాఖలోని భీమిలికి సీఎం జగన్ నిర్ణయంతో మహర్దశ పట్టబోతుంది అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్న స్థానికులు
సీఎం జగన్ ప్రకటనతోనే సంతోషం లో ఉన్న విశాఖ వాసులు, ఇప్పుడు భీమిలిలో రాజధాని ఏర్పాటు చేస్తే తమ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఏకంగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంది చిరంజీవి వంటి ముఖ్య నాయకులు, మాజీ ఉన్నతాధికారులు సైతం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ చేయడానికి కావలసిన బ్రహ్మాండమైన మౌలిక వసతులు వున్న విషయాన్ని గుర్తు చేశారు. .