టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం.. బొత్స మాటల తూటాలు..!
విశాఖపట్నం : టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం అన్న తీరుగా మాట్లాడారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ విధానాలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. టీడీపీ పాలించిన గత ఐదేళ్లలో శాంతిభద్రతల మాట కరువైందని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు విశాఖపట్నం పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. టీడీపీ పాలనలో హత్యలు, దోపిడీలు జరిగినందుకే ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడిని తిరస్కరించారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పాలన కరువుతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు బొత్స. ఆయన పాలనలో వర్షాలు పడలేదని.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రైన వేళావిశేషం వానలు సమృద్దిగా పడుతున్నాయన్నారు. గత ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని.. అక్రమాలు మాత్రం జోరుగా జరిగాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై త్వరలోనే విచారణ జరిపిస్తామన్నారు.
అ అమ్మ, ఆ ఆస్తి.. తల్లిని గెంటేసిన కొడుకులు.. న్యాయం కోసం నడిరోడ్డు మీద..!
టీడీపీ లీడర్లు కోరిన చోటల్లా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడ్డారని ఫైరయ్యారు బొత్స. ఒక్కో భవనానికి దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. అయితే తాము ప్రభుత్వంలోకి వచ్చాకా.. పేదలకు ఉపయోగపడే విధంగా వాటిని నడుపుతామని చెప్పారు.
ఇక వైఎస్ జగన్ తీసుకుంటున్నా చరిత్రాత్మక నిర్ణయాలు చూసి చంద్రబాబు కంగుతింటున్నారని.. ఆ క్రమంలో ఓర్వలేని తనం బాగా అబ్బిందని ఎద్దేవా చేశారు. పారదర్శక పాలన అందించే విధంగా జగన్ ముందుకు సాగుతున్నారని.. తమ ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ది ఎజెండా తప్ప మరో ఆలోచన జగన్కు లేదన్నారు. చంద్రబాబు పాలన అంతా కూడా అవినీతితో కూడుకున్నదని.. ఆయన హయాంలో నదుల అనుసంధానం జరగలేదని.. పార్టీ నేతలకు నిధుల అనుసంధానం చేశారని ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.