చంద్రబాబు బంధువులైతే ఏంటి... వదిలేయాలా... గీతం నిర్మాణాల కూల్చివేతలపై బొత్స
విశాఖ గీతం యూనివర్సిటీ కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్య నారాయణ... ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. తమకు ఎవరి మీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆక్రమించుకున్న భూములను గీతం యూనివర్సిటీ తిరిగి ప్రభుత్వాన్ని అప్పగిస్తే బాగుండేదని అన్నారు. చంద్రబాబు బంధువులు అయినంత మాత్రానా ఆక్రమణలకు గురైన భూమిని వెనక్కి తీసుకోకూడదా అని బొత్స ప్రశ్నించారు.
ఆర్నెళ్లుగా గీతం యూనివర్సిటీ భూములపై వివాదం నడుస్తోందని... ఈ వ్యహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స అన్నారు. అంతే తప్ప దీనిపై చంద్రబాబు ఎదురుదాడి సరికాదన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకునేవారికి వత్తాసు పలకడమేంటని చంద్రబాబును నిలదీశారు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ... ప్రాజెక్ట్ కాంట్రాక్టు కోసం ఏపీ ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాంట్రాక్టు కోసం ప్రాజెక్టు అంచనాలను ఇష్టానుసారం తగ్గించేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతుందని... ఇందుకోసం కేంద్రం సాయం కూడా కోరుతామని అన్నారు.
కాగా,ప్రభుత్వ భూములను ఆక్రమించారన్న ఆరోపణలతో శనివారం(అక్టోబర్ 24) గీతం యూనివర్సిటీకి చెందిన పలు నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేయడంతో కూల్చివేతలకు సోమవారం(అక్టోబర్ 26) వరకు బ్రేక్ పడింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టేటస్ కో ఆదేశాలిచ్చింది.
గీతం వర్సిటీలో కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. మొన్నటికి మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరిని కూల్చివేసిన ప్రభుత్వం... ఇప్పుడు గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చివేయడం టీడీపీని లక్ష్యంగా చేసుకోవడమేనని ఆరోపిస్తోంది.
గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా వైద్య పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్కు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇక్కడ విధ్వంసాలను చూసి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే టీడీపీకి సన్నిహితులు,బంధువులు అయినంత మాత్రానా ఆక్రమణలను ఉపేక్షించాలా అని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది.