Vizag: విశాఖ మిలీనియం టవర్-బీ నిర్మాణం శరవేగం: మరిన్ని నిధులు: ఏపీఐఐసీకి.. !
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలనాపరమైన రాజధానిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రాయలసీమలోని కర్నూలులో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేయడానికి అవసరమైన భవనాలను గుర్తించాలని సూచిస్తూ ఆదేశాలను జారీ చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే.. ఇక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడానికి అవసరమైన చర్యలను చేపట్టింది.
ఏపీఐఐసీ పర్యవేక్షణలో..
విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా అదే ప్రాంతంలో మిలీనియం టవర్-బీ నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. 80 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది. నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.
టవర్-బీ నిర్మాణం వేగవంతానికి నిధులు..
ప్రస్తుతం టవర్-బీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం 19 కోట్ల 73 లక్షల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. టవర్-బీ నిర్మాణానికి మొత్తం 65 కోట్ల 12 లక్షల రూపాయలను విడుదల చేయాల్సి ఉంటుందంటూ దీని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న ఏపీఐఐసీ అధికారులు.. ఐటీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను పంపించారు. ఈ మొత్తంలో- 19 కోట్ల 73 లక్షల రూపాయలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది.
లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో..
లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో టవర్-బీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో నెలరోజుల వ్యవధిలో టవర్-బీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉగాది నాడు విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఈలోగా టవర్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఏపీఐఐసీ అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఐటీ సంస్థల కోసమేనా..
నిజానికి- రుషికొండ ఐటీ పార్క్లో నిర్మించిన మిలీనియం టవర్లో ఇదివరకు కొన్ని ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు కొనసాగుతుండేవి. ఈ టవర్లో సచివాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే కారణంతో.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాన్ని ఖాళీ చేయించారు. ఆ సంస్థల కోసమే టవర్-బీని నిర్మిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయా ఐటీ సంస్థలు వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని, వాటన్నింటినీ సమీకృతం చేయడానికే టవర్-బీని నిర్మిస్తున్నారని చెబుతున్నారు.