ఏపీకి కేంద్రం శుభవార్త, తీరిన ఉత్తరాంధ్రుల సుదీర్ఘ కల: విశాఖకు రైల్వే జోన్, అధికారిక ప్రకటన
విశాఖపట్నం/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 1వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. ఆయన వైజాగ్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకుముందే ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పనుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు గోయల్ ఆ శుభవార్త చెప్పారు.
విశాఖపట్నంకు రైల్వే జోన్
విశాఖపట్నంకు రైల్వే జోన్ ప్రకటించారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు మూడు రోజుల ముందు ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటన చేశారు. బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమేనని, ప్రధాని మోడీ పర్యటనకు ముందే శుభవార్త వస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఈ రోజు (బుధవారం) కేంద్రమంత్రి విశాఖ రైల్వే జోన్ పైన ప్రకటన చేశారు.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్కు ఒకే చెప్పారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, విశాఖలు ఈ కొత్త (విశాఖ) రైల్వే జోన్ పరిధిలో ఉంటాయి. విశాఖ రైల్వే జోన్ను సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా (ఎస్సీవో) పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ రైల్వే జోన్ ప్రకటనతో ఎట్టకేలకు ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది. దశాబ్దాలుగా రైల్వే జోన్ పెండింగులో ఉంది. వాల్తేరు డివిజన్ను రాయగఢ్గా మార్చనున్నారు.
సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు
షెడ్యూల్ 13లోని 8వ ఆర్టికల్ ప్రకారం సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ పని చేస్తుంది. వాల్తేరు డివిజన్ను రెండు భాగాలుగా విభజిస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు.
పీయూష్ గోయల్
విశాఖ రైల్వే జోన్ పైన విస్తృతంగా అధ్యయనం చేశామని పీయూష్ గోయల్ చెప్పారు. వాల్తేరు డివిజన్ను రెండు భాగాలుగా చేసి, ఓ భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వోలోని విజయవాడ డివిజన్గా ఉంటుందని, మిగిలిన భాగం రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్గా ఉంటుందని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందెడ్ డివిజన్లు ఉంటాయని చెప్పారు. రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు.రైల్వే జోన్ పైన ఈ రోజు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.