వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ముందుకే- కేంద్రం సంకేతాలు- బిడ్, ఇతర వివరాలు పంపాలని ఆదేశం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ఓ నిర్ణయం తీసుకున్న కేంద్రం, వడివడిగా అడుగులు వేస్తోంది. ఓవైపు ఏపీలో స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నా, సీఎం జగన్ ప్రధానికి లేఖ రాసినా దీనిపై ఎలాంటి స్పందనా లేదు. తాజాగా వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా అవసరమైన వివరాలు అందించాలని అధికారులకు కేంద్రం నుంచి మెయిల్ అందినట్లు తెలుస్తోంది. దీంతో వారు వివరాలు పంపే పనిలో బిజీగా ఉన్నారు.
జగన్కు అసలు పరీక్ష-రాజధానులు, వైజాగ్ స్టీల్పై రిఫరెండం-రెండుచోట్ల ఎదురీత తప్పదా ?
వైజాగ్ స్టీల్పై వేగంగా కేంద్రం అడుగులు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీనిపై వస్తున్న వ్యతిరేకతను పట్టించుకునే పరిస్ధితుల్లో లేదని తేలిపోయింది. అంతే కాదు ప్రైవేటీకరణపై ఆలస్యం చేస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కేంద్రం... సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఏడాదిలోపు ప్రైవేటీకరణ పూర్తి చేయాలని నిర్ణయించిన కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆ మేరకు వివరాలు సేకరించే పనిలో ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ తాజా పరిస్ధితి ఏంటి ? ప్రైవేటీకరణ ప్రక్రియలో ఏయే అంశాలను జత చేయాలి, ఇతరత్రా వివరాలను సిద్ధం చేస్తోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వివరాలు కోరిన కేంద్రం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కీలకమైన బిడ్డింగ్ విధానం కోసం అవసరమైన సాంకేతిక వివరాలు ఇవ్వాలని అధికారులకు తాజాగా కేంద్రం ఈ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ బిడ్డింగ్ వివరాలతో పాటు లాభనష్టాలు, ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలను కూడా కోరినట్లు సమాచారం. దీంతో అధికారులు వాటిని అంచనా వేసే పనిలో బిజీగా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నెలలో ఈ వివరాలు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఫలించని ఉద్యమాలు, జగన్ లేఖ వృథా ?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రస్తుతం నగరంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేపడుతున్నాయి. మరోవైపు ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. త్వరలో అసెంబ్లీ తీర్మానం చేసేందుకు కూడా వైసీపీ సర్కారు సిద్ధమవుతోంది. అయినా కేంద్రం ఇవన్నీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేనట్లు తేలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ సాగుతున్న తరుణంలోనే స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై కేంద్రం వేగంగా అడుగులు వేయడం చూస్తుంటే రాజకీయంగా తమకు దీని వల్ల ఎలాంటి నష్టం లేదనే అంచనాకు వచ్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.