విశాఖలో చంద్రబాబు ర్యాలీకి బ్రేకులు ... అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖలో పార్టీ సమీక్ష సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు తెలుగు తమ్ముళ్ల ర్యాలీని భగ్నం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై చంద్రబాబు సానుకూలత ? .. టీడీపీ వర్గాల్లో చర్చ
తెలుగుదేశం పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలకు హాజరయ్యేందుకు విశాఖ విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ర్యాలీని విశాఖ పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెనుక ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయానికి చంద్రబాబు నాయుడిని ర్యాలీగా తీసుకువెళ్లేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. దీంతో అధినేత సైతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు మాత్రం అంగీకరించ లేదు.
ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ తెలుగుదేశం పార్టీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద కాన్వాయ్ని అడ్డుకుని కార్యకర్తలను, నాయకులను అక్కడి నుండి పంపించి వేశారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్ని విడిచి పెట్టారు పోలీసులు. అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు విచ్చేసి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కాని విశాఖలో టిడిపి ర్యాలీ ప్రయత్నాన్ని మాత్రం పోలీసులు నిలువరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్వహించ తలపెట్టిన ర్యాలీలను పోలీసులు ప్రతీసారి భగ్నం చేస్తున్న విషయం తెలిసిందే . దీంతో తెలుగు తమ్ముళ్ళు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.